ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్ 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా మార్కెట్ ధరలు పెరుగుతాయని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ఏసీ రకం తేజా మిర్చికి ఒక క్వింటాల్కు రూ.22 వేలకు పైగా పలుకగా ఈసారి పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడిపోయాయి. ఈ సీజన్ ఆరంభంలో ఒక క్వింటాల్కు రూ.14 వేలు మాత్రమే పలకడంతో మెజార్టీ రైతులు పంటను నిల్వ చేసుకున్నారు. వీరికి తోడు మిర్చి ఖరీదుదారులూ కొనుగోలు చేసిన పంటను నిల్వ చేశారు. సరుకు నిల్వ చేసిన రోజు కంటే ఇప్పుడు ధరలు తక్కువగా ఉండడంతో శీతల గిడ్డంగుల నుంచి సరుకును బయటకు తీయడం లేదు. గడిచిన నెల రోజుల్లో ఏసీ రకం మిర్చికి క్వింటాల్కు రూ.13వేల నుంచి రూ.13,500 మాత్రమే పలికింది. గత వారం రోజుల నుంచి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం జెండా పాట ఒక క్వింటాల్కు రూ.14,300 పలికింది. అలాగే మధ్య ధర రూ.11,300, కనిష్ఠ ధర రూ.9,500 పలికింది. ధర కొద్దిగా ఆశాజనకంగా ఉండడంతో నగర పరసర ప్రాంతాల కోల్ట్స్టోరేజీల నుంచి రైతులు రెండు వేల బస్తాలను బయటకు తీసి అమ్మకానికి పెట్టారు.
కోల్ట్స్టోరేజీల్లో బస్తాల నిల్వలు..
ఖమ్మం ఏఎంసీ పరిధిలోని 14 కోల్డ్ స్టోరేజీల్లో 11.13 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం ఉండగా ఇప్పటికే పూర్తిగా నిండింది. మధిర ఏఎంసీ పరిధిలో 12 కోల్డ్స్టోరేజీల పరిధిలో 11 లక్షల బస్తాల సామర్థ్యం కాగా 9.61 లక్షల బస్తాలు, నేలకొండపల్లి ఏఎంసీ పరిధిలోని రెండు కోల్డ్స్టోరేజీల పరిధిలో 2.20 లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం ఉండగా మరో 30 వేల బస్తాల నిల్వకు మాత్రమే అవకాశం ఉన్నది. వైరా మార్కెట్ పరిధిలో ఆరు కోల్డ్ స్టోరేజీల్లో ఏడు లక్షల నిల్వ సామర్థ్యం ఉండగా ప్రస్తుతం మరో 30 వేల బస్తాల నిల్వకు అవకాశం ఉన్నది. మద్దులపల్లి మార్కెట్ పరిధిలో ఆరు స్టోరేజీల్లో ఏడు లక్షల బస్తాల నిల్వ సామర్థ్యం ఉండగా పూర్తి నిండిపోయాయి. మార్కెటింగ్శాఖ అధికారుల నివేదిక ప్రకారం రైతులు, వ్యాపారులు కలిపి దాదాపు 36 లక్షల బస్తాలకు పైగా నిల్వ చేశారు. ఇవి కాక కోల్ట్ స్టోరేజీల్లో మరో రెండు లక్షల బస్తాలు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉన్నది. ఒకటి రెండు రోజుల్లో అన్ని కోల్ట్స్టోరేజీలు నిండే అవకాశం ఉన్నది.