ఖమ్మం, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేస్తున్నది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో వైద్యారోగ్యశాఖ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. సర్పంచ్లు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్ల సహకారంతో స్పెషల్ డ్రైవ్ చేపడతున్నది. గతానికి భిన్నంగా రోజుకు సరాసరి 20 వేల మందికి టీకాలు వేస్తూ సర్కారు లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నది.
39 గ్రామాల్లో వందశాతం..
ఖమ్మం జిల్లాలో కొవిడ్ టీకాల ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వైద్యారోగ్యశాఖ యంత్రాంగం ఇంటింటి సర్వే ఆధారంగా ఇప్పటి వరకు మిగిలిపోయిన వారినీ గుర్తిస్తూ సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్హెల్త్ సెంటర్స్ వద్దకు తీసుకెళ్లి టీకా వేస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 39 గ్రామాల్లో వందశాతం టీకాలు వేశారు. తాజాగా అందిన సమాచారం మేరకు.. కల్లూరులో ఏడు, తిరుమలాయపాలెం నాలుగు, మధిరలో నాలుగు, ముదిగొండ రెండు, సింగరేణిలో రెండు, ఖమ్మం రూరల్లో 11, పెనుబల్లి రెండు గ్రామాల్లో, రఘునాథపాలెం, సత్తుపల్లి, ఎర్రుపాలెం, తల్లాడ, ఏన్కూరు, కామేపల్లి, కూసుమంచి మండలాల్లో ఒక్కొక్క గ్రామం చొప్పన 100 శాతం టీకాలు వేశారు. దీంతో మండల మెడికల్ ఆఫీసర్స్, సర్పంచ్లు, ఏఎన్ఎంలను కలెక్టర్ వీపీ గౌతమ్ సన్మానించారు. మిగిలిన పంచాయతీల్లో ఇదే స్ఫూర్తి ప్రదర్శించాలని కోరారు.
6.90 లక్షల మందికి మొదటి డోస్..
నెల రోజుల క్రితం వరకు టీకా కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. అక్కడక్కడ వైద్యారోగ్యశాఖ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనలూ ఉన్నాయి. పరిస్థితిని అంచనా వేసిన వైద్యారోగ్యశాఖ 18 ఏండ్లు నిండిన వారందరికీ సరిపడా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఊరూరా టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలోని నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్స్, 26 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రతి గ్రామానికో కేంద్రాన్ని ఏర్పాటు చేసి టీకాలు వేస్తున్నారు. సర్పంచ్లు, ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
18 ఏళ్లు నిండినవారందరికీ టీకా వేయించాం
మా గ్రామంలో 18ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాం. 100 శాతం వ్యాక్సిన్ పూర్తయిన గ్రామాల జాబితాలో చేరినందుకు సంతోషంగా ఉంది. సహకరించిన అధికారులు, ప్రజలకు కృతజ్ఞతలు. తొలి డోసు వందశాతం పూర్తయింది. రెండో డోసు 30శాతం మందికి వేశారు.
-ఎన్వీ బంజర సర్పంచ్, జర్పుల సక్రాం