అశ్వారావుపేట, సెప్టెంబర్ 20:గెలల అక్రమ రవాణాపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా అక్రమార్కులు ఖాతరు చేయడం లేదు.భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ ఈ ఏడాది జూలై 24వ తేదీన ఎల్ఆర్ నెం.డీహెచ్అండ్ఎస్వో/బీ/ 442/2021-2022 ఉత్తర్యులను జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, తహసీల్దార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లకు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న గెలలను అడ్డుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. అక్రమార్కులు ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు.
ఎర్రుపాలెం మండల వ్యాప్తంగా ఆయిల్ఫెడ్ పరిధిలో సుమారు 100 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు సాగవుతున్నాయి. వీటిలో 63 ఎకరాల నుంచి దిగుబడులొస్తున్నాయి. ఆయిల్ఫెడ్ అంచనా ప్రకారం కేవలం 600-650 టన్నుల గెలలు మాత్రమే సేకరించాలి. అక్రమ వ్యాపారులు వేల టన్నుల్లో గెలలను అక్రమంగా తరలిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళా తోటలను కౌలుకు తీసుకున్నట్లు చూపుతూ ఎఫ్టీ 001 కోడ్పై 2020లో 9,450 మెట్రిక్ టన్నులు, 2021 సెప్టెంబర్ వరకు 7,450 మెట్రిక్ టన్నులు, ఎఫ్ 4,104 కోడ్పై 2020లో 2,050 మెట్రిక్ టన్నులు, 2021 సెప్టెంబర్ వరకు 8,030 మెట్రిక్ టన్నుల గెలలను అక్రమంగా తరలించింది. కేవలం రవాణా చార్జీల కిందనే ఆమె ఏటా ఒక్కొక్క కార్డుపై రూ.90 లక్షలకు పైగా స్వాహా చేస్తున్నది. రెండు ఎఫ్ కోడ్లపై రెండేళ్లలో సుమారు రూ.3.50 కోట్లు దోచుకున్నది. ఇవేకాక మరోరెండు ఎఫ్ కోడ్ల్లో గెలలు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాకు చెందిన మరో వ్యాపారి ఎఫ్టీ 003 కోడ్పై 2020లో 6,210 టన్నులు, 2021లో 6,370 మెట్రిక్ టన్నుల గెలలను ఎర్రుపాలెం నుంచి తరలించినట్లు రవాణా చార్జీల పేరుతో సంస్థ నిధులను స్వాహా చేశాడు. ఈ ఇద్దరు కలిసి సంస్థ నుంచి రవాణా చార్జీల పేరుతో ఏకంగా రూ.5 కోట్లపైనే కాజేశారు. వీరితో పాటు మరికొందరు అక్రమార్కులు ‘ఎఫ్’ కోడ్లతో అక్రమ వ్యాపారాలకు తెరలేపారు. ఈ అక్రమ వ్యాపారంలో ఆయిల్ఫెడ్కు చెందిన ఒక మేనేజర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమ వ్యాపారానికి స్కెచ్ వేయడంతోపాటు ఓ ఉన్నతాధికారి సహకారంతో ఆయిల్పాం యాక్ట్ను ఉల్లంఘిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నాడని ఆరోపణలున్నాయి. రెండేళ్లుగా అక్రమ గెలల రవాణాతో రూ.కోట్ల స్వాహా అవుతున్నా రైతు సంఘం బాధ్యులు మిన్నకుండడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ నిబంధనలు..
పామాయిల్ సాగు విస్తరణ ప్రభుత్వరంగ సంస్థతోపాటు ప్రైవేట్ కంపెనీలకూ ఉద్యాన శాఖ కేటాయిస్తుంది. విస్తీర్ణంలోని తోటల్లోనే గెలలు సేకరించి క్రసింగ్ చేసుకోవాలి. ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వ రంగసంస్థ ఆయిల్ఫెడ్ తమ పరిధి దాటి గెలలు సేకరించొద్దు. ఒకవేళ సేకరిస్తే కమిటీ ద్వారా విచారణ చేపడుతోంది. నిర్ధారణ అయితే ఉద్యానశాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.