భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఖ్యాతిని చాటుకునేలా భద్రాద్రి జిల్లా అభివృద్ధిలో పరుగులు పెడుతోందని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అభివృద్ధికి గీటురాయిగా ప్రభుత్వ పథకాలు నిలుస్తున్నాయని అన్నారు. బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టును నిర్మించుకుంటున్నామమన్నారు. వచ్చే ఏడాది నాటికి సీతమ్మసాగర్ పనులు పూర్తవుతాయన్నారు. పంటల పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఏటా మాదిరిగానే ఈ యాసంగి సమయంలో కూడా పంటల సీజన్కు ముందుగానే జిల్లాలోని 1,34,732 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.206 కోట్లను జమచేసినట్లు వివరించారు. దళితబంధు అమలుకు కూడా కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ పిల్లల్లో పౌష్టికాహర లోపం లేకుండా ప్రత్యేక మెనూను అమలు చేసినట్లు చెప్పారు. పోషకాహార లోపం లేకుండా తీసుకున్న చర్యలకు గాను ప్రధాని మోదీ భద్రాద్రి జిల్లాను ఆకాంక్ష జిల్లాలో బెస్ట్ జిల్లాగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మున్ముందు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలనూ ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని అన్నారు. కరోనా కట్టడి కోసం మొదటి డోస్ వ్యాక్సినేషన్ను వందశాతం పూర్తి చేశామని, రెండో డోస్ను కూడా నూరు శాతం పూర్తి చేసేందుకు దగ్గరలో ఉన్నామని అన్నారు. ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు, తద్వారా పేదలకు చేకూరిన లబ్ధి వివరాలను కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. మణుగూరు మండలం కూనవరానికి చెందిన ఆదివాసీ సకిని రామచంద్రయ్యకు పద్మశ్రీ పురస్కారం లభించడం గర్వకారణమని అన్నారు. జిల్లా ప్రజల తరఫున ఆయనకు అభినందనలు చెబుతున్నామన్నారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డీఆర్వో అశోక్చక్రవర్తి, ఏవో గన్యానాయక్, డీపీఆర్వో శీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.