ట్విట్టర్ వేదికగా తెలిపిన సమస్యకు స్పందించిన మంత్రి కేటీఆర్
ములకలపల్లి, జూలై 29:నిరుపేదలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటారు మంత్రి కేటీఆర్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమందికి అండగా నిలబడి వారి జీవితాలను నిలబెట్టారు.. సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసిన సమస్యలను ఆలకించి వారికి తక్షణం సాయం అందేలా చూస్తారు.. తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడి కాలికి రాడ్ వేయించుకుని, తిరిగి దానిని తీయించుకోలేని ఓ యువతి దయనీయమైన స్థితిపై స్పందించారు.. ఆమెకు మూడు చక్రాల వాహనం అందేలా చర్యలు తీసుకుంటున్నారు..
భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం భగత్సింగ్నగర్ కాలనీకి చెందిన గుర్రం మౌనిక అనే యువతి ఏడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైంది. ఆమెది అత్యంత నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. గాయాల కారణంగా ఆమె కాలిలో రాడ్, స్టీల్ ప్లేట్ను వైద్యులు అమర్చారు. అయితే అమర్చిన రాడ్ను ఇప్పుడు బయటకు తీయాల్సి ఉండగా ఆర్థిక స్తోమత లేకపోవడంతో భిక్షాటన చేపట్టింది. కాలికి అమర్చిన స్టీల్ ప్లేట్తో యువతి రోడ్ల వెంబడి పాకుతూ వెళుతున్న ఫొటోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. కొందరు యువకులు ఆమె దయనీయమైన స్థితిని మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో ఆయన వెంటనే స్పందించారు. దీనిపై గురువారం మంత్రి కార్యాలయం నుంచి భగత్సింగ్కాలనీ సర్పంచ్ బీబినేని భద్రానికి ఫోన్కాల్ వచ్చింది. ఆమెకు మూడు చక్రాల వాహనం అందిస్తామని మంత్రి కార్యాలయ ప్రతినిధులు చెప్పినట్లు సర్పంచ్ వెల్లడించారు. మరోవైపు ఆమె దైన్య స్థితిని తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ంపదించారు. బాధితురాలిని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. సొంత ఖర్చులతో ఆమెకు వైద్యం చేయిస్తున్నారు.