LIC | ఒకవైపు దేశమంతా సార్వత్రిక ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా.. సందిట్లో సడేమియా అన్నట్లు కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు పావులు కదుపుతోంది. ప్రత్యేకించి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేసన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ల్లో మైనారిటీ వాటాను విక్రయించాలని తలపోస్తున్నట్లు సమాచారం. సరైన ఇన్వెస్టర్ దొరికిన తర్వాత రెండు సంస్థల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో మైనారిటీ వాటా విక్రయించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. షేర్ల విలువ ఆధారంగా జీఐసీలో 10 శాతం వాటాను కేంద్రం విక్రయిస్తుందని ఓ అధికారి చెప్పారు. జీఐసీలో 10 శాతం వాటా విక్రయం ద్వారా రూ.5700 కోట్ల నిధులు సమీకరించాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం. జీఐసీలో వాటాల విక్రయానికి నిర్వహించిన రోడ్ షోల్లో సానుకూల స్పందన వచ్చిందని ఓ ప్రభుత్వాధికారి చెప్పారు. గత ఆరు నెలల్లో జీఐసీ షేర్లు సుమారు 45 శాతం పెరిగాయి.
ఇక భారతీయ జీవిత బీమా సంస్థలోనూ వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైందని అధికార వర్గాలు తెలిపాయి. 2022లో దేశీయ స్టాక్ మార్కె్ట్లలో ఎల్ఐసీ లిస్టయినప్పటి నుంచి ఏడేండ్లలో పది శాతం, పదేండ్లలో 25 శాతం వాటా విక్రయించాలని కేంద్రం తలపోస్తున్నది. గత ఆరు నెలల్లో ఎల్ఐసీ షేర్ 58 శాతం పుంజుకున్నది. శుక్రవారం మార్కెట్ల ట్రేడింగ్ లో ఎల్ఐసీ షేర్ రూ.973 వద్ద ముగిసింది. ఐపీఓ ద్వారా ఎల్ఐసీలో ప్రభుత్వం తన 3.5 శాతం వాటాను విక్రయించింది. తాజాగా మరో 1.5 శాతం వాటా విక్రయానికి ప్రణాళిక రూపొందించింది. 1.5 శాతం వాటా విక్రయంతో రూ.9200 కోట్ల నిధులు సేకరించడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. అయితే దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ముందుకు రాలేదు.