Infosys – Nestle India | దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ గైడెన్స్ అంచనాలను కుదించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఇన్ఫీ గ్రోత్ గైడెన్స్ అంచనాలు మార్కెట్ వర్గాలకు రుచించక పోవడంతో శుక్రవారం ఇన్ఫీ షేర్ దాదాపు ఒకశాతం నష్టపోయింది. బీఎస్ఈలో ఇన్ఫీ షేర్ అంతర్గత ట్రేడింగ్ లో 2.87 శాతం నష్టపోయినా, ట్రేడింగ్ ముగిసే సమయానికి 0.63 శాతం నష్టంతో రూ.1411.60 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈలో ఇన్ఫీ షేర్ ఇంట్రాడే ట్రేడింగ్ లో 2.85 శాతం పతనంతో రూ.1,378.75 వరకూ పడిపోయినా చివరకు 0.51 శాతం నష్టంతో రూ.1,411.95 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,655.37 కోట్లు నష్టపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సర మార్చి త్రైమాసికం ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్ నికర లాభాల్లో 30 శాతం గ్రోత్ నమోదు చేసింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ అంచనాలను 1-3 శాతానికి పరిమితం చేసింది.
నెస్లే ఇండియా షేర్ల పతనం రెండో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. గ్లోబల్ ఎఫ్ఎంసీజీ మేజర్ నెస్లే ఇండియా.. తన మిల్క్ ప్రోడక్ట్స్ లో చక్కెర శాతం ఎక్కువగా వాడుతుందని వార్తలు వచ్చాయి. దీంతో గురు, శుక్రవారాల్లో నెస్లే ఇండియా షేర్లు భారీగా పతనం అయ్యాయి. బీఎస్ఈలో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో నెస్లే షేర్ 3.53 శాతం నష్టంతో రూ.2,375.75 వరకూ పతనమైనా, ముగింపు సమయానికి 1.04శాతం పతనంతో రూ.2,437.10 వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈలోనూ 2.13 శాతం పతనంతో రూ.2410కి పడిపోయినా, ముగింపు సమయానికి 1.32 శాతం నష్టంతో రూ.2430 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,610.55 కోట్లు నష్టంతో రూ.2,34,974.74 కోట్ల వద్దకు పడిపోయింది.