కార్పొరేషన్, ఫిబ్రవరి 21 : ఎంపీ బండి సంజయ్కు ఇన్నాళ్లు కనిపించని సర్పంచులు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయనగానే గుర్తొచ్చారా..? అని కరీంనగర్, జగిత్యాల, హనుమకొండ జడ్పీ అధ్యక్షులు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్బాబు ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో మాజీ సర్పంచుల నుంచి మద్దతు పొందాలన్న కుట్రతోనే వారికి లేఖలు రాస్తున్నారని విమర్శించారు. ఎంపీగా ఐదేళ్లలో నియోజకవర్గానికి నిధులు తేలేని ఆయన, ఇప్పుడు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని దుయ్యబట్టారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని ఎంపీ ఉండడం బాధాకరమని ఎద్దేవా చేశారు. ఎంపీగా సంజయ్ ఏం అభివృద్ధి చేశారో.. మాజీ ఎంపీ వినోద్కుమార్ ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసన్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధం అని సవాల్ విసిరారు. వినోద్ కుమార్ జమ్మికుంట, ఉప్పల్, బిజిగిరిషరీఫ్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేయించారని, కరీంనగర్కు స్మార్ట్సిటీ సాధించారని కొనియాడారు. సంజయ్ స్థానిక సంస్థల్లో అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని, కనీసం సమావేశాలకు కూడా రాలేదని, ఇప్పుడు మాత్రం సర్పంచుల సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతి ద్వారా ప్రతి నెలా పంచాయతీలకు నిధులు రావడంతోనే ఎంతో అభివృద్ధి సాధించాయని, దీనిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులను ఇచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలోనైనా సంజయ్ సర్పంచులను గుర్తించి అభినందనలు తెలిపారా..? అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఏమైనా కృషి చేశారా? అని అడిగారు. ఉపాధి హామీ పథకం పని దినాలను తగ్గించింది కేంద్ర ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు.
ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మేం డిమాండ్ చేస్తున్నా, ఫసల్ బీమా యోజనలో మండలాన్ని కాకుండా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలంటున్నా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. గ్రామ పంచాయితీలను, స్థానిక ప్రజాప్రతినిధులను ఏ రోజు కూడా పట్టించుకోని బండి సంజయ్ ఇప్పుడు వచ్చి ఎంతో పని చేశారంటూ లేఖలు రాయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి కుయుక్తులు మానుకొని, ఐదేళ్లలో నీవు చేసిన అభివృద్ధిని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు ఇఫ్తికార్, ఉదారపు మారుతి తదితరులు పాల్గొన్నారు.