జమ్మికుంట, డిసెంబర్ 5: నేల తల్లి ఆరోగ్యాన్ని రక్షించుకుందామని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి వీ శ్రీధర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్యవిభాగం శాస్త్రవేత్త జక్కు విజయ్ ఆధ్వర్యంలో ‘నేల తల్లి దినోత్సవం-మృత్తికలు-ఆహార ప్రదాయినులు’ అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా డీఏవో హాజరై మాట్లాడారు. భూసారాన్ని కాపాడుకుంటేనే రాబోయే తరానికి సారవంతమైన నేలను అందిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు వాడుతున్నారని, సేంద్రియ సాగు దిశగా రైతులు సాగాలని కోరారు. నేలలో యేటా సేంద్రియ కర్భన శాతం తగ్గుతూ వస్తున్నదని, దానిని నివారించేందుకు రైతులు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. జీవన ఎరువుల వాడకం, పంట మార్పిడి చేసుకోవాలని సూచించారు. మానవాళి జీవన మనుగడకు నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ వెంకటేశ్వర్రావు పేర్కొన్నారు. పంట అవశేషాలను నేలలోనే కలియ దున్నాలని తెలిపారు. సారవంతమైన నేలకోత జరుగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మట్టి పరీక్షలు చేయించాలని, శాస్త్రవేత్తల సలహాలతో సాగు చేయాలని శాస్త్రవేత్త విజయ్ సూచించారు. నేల ఆరోగ్య, దాని ప్రాముఖ్యతను వివరించారు.
ఆయిల్ ఫాం సాగు మేలు
జిల్లా ఉద్యానవన అధికారి శ్రీనివాస్ రైతులు తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు పొందేందుకు ఆయిల్ ఫాం సాగు మేలని జిల్లా ఉద్యానవన విభాగాధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం కేవీకేలో అయిల్ ఫాం తోటల సాగులో మెళకువలపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని సేద్య విభాగం శాస్త్రవేత్త జక్కు విజయ్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధికారి శ్రీనివాస్ హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. రైతులు మారుతున్న కాలంతో పాటు సాగులో కొత్త అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. ఆయిల్ ఫాం సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, సబ్సిడీలు కూడా అందిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకసారి నాటిన ఆయిల్ ఫామ్ మొక్కతో మూడేళ్ల వరకు దిగుబడులు పొందవచ్చని తెలిపారు. తర్వాత రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమాల్లో శాస్త్రవేత్తలు ప్రశాంతి, మహేశ్, శ్రీనివాస్రెడ్డి, అధికారులు, సిబ్బంది, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.