సిరిసిల్ల /సిరిసిల్ల టౌన్, నవంబర్ 9: ఎలాంటి హంగూ.. ఆర్భాటం లేకుండా మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన, ఉదయం 11.30 గంటలకు సిరిసిల్లకు చేరుకున్నారు. మొదట రగుడు జంక్షన్ వద్ద ఉన్న తెలంగాణ భవన్కు రాగా, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు ఘనస్వాగతం పలికారు. అక్కడ సర్వమత ప్రార్థనల అనంతరం రామన్న, ముఖ్య నాయకులతో కలిసి నామినేషన్ వేసేందుకు వెళ్తూ మహనీయులను స్మరించుకున్నారు.
పాత బస్టాండ్లోని సంజీవయ్య, నేతన్న, ప్రధాన చౌరస్తాలో అంబేద్కర్, మార్కెట్ ఏరియాలో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఉదయం 11.40 గంటలకు ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వీర్నపల్లి జడ్పీటీసీ గుగులోత్ కళావతి, ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ హన్మంతరెడ్డితో కలిసి 11.45 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. తిరిగి వస్తూ.. రేణుకా ఎల్లమ్మ జంక్షన్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ, మొదటి బైపాస్రోడ్డులోని నర్సింగ్ కళాశాల చౌరస్తాలో ఉన్న సర్దార్ సర్వాయిపాపన్న విగ్రహాలకు నివాళులర్పించారు.
మధ్యాహ్నం 12.20 గంటలకు తెలంగాణభవన్కు చేరుకొని, అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హెలీప్యాడ్ చేరుకొని, తిరిగి హైదరాబాద్కు పయనమయ్యారు. అయితే, నామినేషన్ సందర్భంగా వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ‘రామన్న మీ వెంటే మేమున్నాం’ అంటూ మద్దతు తెలిపారు. బైక్లు, కార్లకు గులాబీ జెండాలు కట్టుకొని కేటీఆర్ కాన్వాయ్ వెంట ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. దారిపొడవునా ‘జై కేటీఆర్’ ‘జైజై కేటీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ వేసిన అనంతరం కేటీఆర్ను కలిసేందుకు కార్యకర్తలు పోటీపడ్డారు. మంత్రి అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.