సిరిసిల్ల అంటే మెట్ట ప్రాంతం.. పడావు పడ్డ భూములు.. ఇంకిపోయే బోర్లు.. సాగునీటి కోసం తండ్లాడిన రైతాంగం.. మరోవైపు వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో సిరిసిల్ల నేతన్న ఉరితాడును పేనింది. ఇది సమైక్య పాలకులు మిగిల్చిన విషాదం.. కానీ స్వరాష్ట్రంలో పరిస్థితి మారింది. అన్నదాత, నేతన్న ఆక్రందనలు చూసిన గత బీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాంతం ప్రగతికి నడుంబిగించింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా కేటీఆర్ చేసిన అభివృద్ధితో సిరిసిల్ల రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కండ్ల ముందున్న ప్రగతికే పట్టం కట్టారు. సమైక్య పాలనలో కన్నీళ్లు, విషాదాన్ని తుడిచివేస్తూ, ఉరిసిల్ల నుంచి ‘సిరిశాలగా’ మార్చిన మహా నాయకుడు కేటీఆర్కే మరోసారి అండగా ఉండి, అభిమానాన్ని చాటుకున్నారు.
– రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ)
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో ఉపాధి కరువై.. మర నేతన్నలు దారాలనే ఉరితాళ్లుగా పేనుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఏ వార్డులో చూసినా నేతన్నల మరణ గాథలు, కుటుంబ సభ్యుల రోదనలు.. ఇది నాటి సమైక్య పాలనలోని నాటి పరిస్థితి. ఆ పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యేగా, మంత్రిగా కేటీఆర్ నేతన్నల బతుకులు మార్చేందుకు వస్త్ర పరిశ్రమను భుజానికెత్తుకున్నారు. మైక్రో, శేర్ముల్లా ఫైనాన్స్ ఉచ్చులో కూరుకుపోయిన నేతన్నలను విముక్తి చేసేందుకు కేసీఆర్ పార్టీ ఫండ్ రూ.50లక్షలు ఇచ్చి ఆదుకున్నారు.
బయట అప్పుపుట్టక బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయించారు. 904మంది నేత కార్మికులకు రూ.3.70కోట్లు మాఫీ చేయించారు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కార్మికులకు చేతినిండా పని కల్పించాలన్న ఉద్దేశంతో బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు ఇప్పించారు. ఏటా రూ.350కోట్ల బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్లు, క్రిస్మస్, రంజాన్ దుస్తుల తయారీ ఆర్డర్లు సిరిసిల్లకే ఇప్పించారు. చీరెల తయారీతో చేతినిండా పని, పనికి తగ్గ కూలీ నెలకు రూ.15వేల నుంచి రూ.20వేలు వచ్చేలా కృషి చేశారు. పాత మరమగ్గాలను ఆధునీకరించుకునేందుకు, డాబీల ఏర్పాటుకు సబ్సిడీ రుణాలు అందించారు. దేశంలోని అన్ని రాష్ర్టాలలోని మరమగ్గాల తయారీ కంపెనీలతో సిరిసిల్ల మార్కెట్ కమిటీలో ఎగ్జిబిషన్ నిర్వహించారు.
మరమగ్గాల ఆధునీకరణకు నిధులు ఇచ్చి నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులకు శ్రీకారం చుట్టించారు. నేతన్నకు చేయూత పథకంలో 5,803 మందికి రూ.1.64కోట్లు 10శాతం నూలుపై సబ్సిడీ ఇప్పించారు. ఈ పథకంలో ఒక్కో కార్మికుడు రూ.30వేల నుంచి రూ.60వేల వరకు లబ్ధి పొందారు. రైతులకు మాదిరిగా దేశంలో ఎక్కడా లేనివిధంగా నేతన్నకు రూ.5లక్షల బీమా పథకం అమలు చేశారు. అనారోగ్యంతో చనిపోయిన వారికి రూ.5లక్షల బీమాతో భరోసా కల్పించారు. జిల్లాలో పది మంది చనిపోయిన కార్మిక కుటుంబాలకు రూ.50లక్షలుల పరిహారం ఎల్ఐసీ నుంచి ఇప్పించి అండగా నిలిచారు.
ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు తొమ్మిది మండలాలు ఉన్న సిరిసిల్లను జిల్లా చేశారు. సమీకృత కలెక్టరేట్, పోలీస్ భవనం, జిల్లాకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చారు. రూ.వంద కోట్లతో సిరిసిల్ల పట్టణంలో రహదారుల విస్తరణ, జంక్షన్లను అభివృద్ధి చేశారు. సిరిసిల్ల అంటే వస్త్ర పరిశ్రమ అని గుర్తుండేలా కొండా లక్ష్మణ్బాపూజీ విగ్రహం, గాంధీ, నేతన్నల కాంస్య విగ్రహాలు పెట్టించారు.
పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా పార్కులు, మినీట్యాంక్ బండ్, మానేరులో బతుకమ్మ ఘాట్లు నిర్మించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిరిసిల్ల జిల్లా కేంద్రానికి ఇరువైపులా రెండు వంద ఫీట్లతో రెండు బైపాస్లు ఏర్పాటు చేశారు. మధ్యలో డివైడర్లు, అందులో చెట్ల మొక్కల పెంపకంతో హరితతోరణంగా సిరిసిల్లకు స్వాగతం పలికేలా అభివృద్ధి చేశారు.
నాడు కేవలం ఒకే ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలకే పరిమితమైన సిరిసిల్ల నేడు ఎడ్యుకేషన్ హబ్గా ఏర్పడింది. మెడికల్, వ్యవసాయ యూనివర్సిటీ, వ్యవసాయ పాలిటెక్నిక్, ఐటీఐ, అంతర్జాతీయ డ్రైవింగ్స్కూల్, జేఎన్టీయూ విద్యాసంస్థలను తీసుకొచ్చారు. విద్యతోపాటు ప్రతి ఒక్కరికీ చేతినిండా పని కల్పించాలన్న సంకల్పం. అందులో భాగంగా రూ.165 కోట్లతో అప్పారెల్ పార్కును పెట్టించారు. ఇప్పటికే గోకల్దాస్ కంపెనీ వెయ్యి మందికి లోదుస్తుల తయారీలో ఉపాధి కల్పించింది.
మరో అంతర్జాతీయ సంస్థ టెక్స్పో ఇండస్ట్రీస్ త్వరలో రెండువేల మందికి ఉపాధి కల్పించే దిశగా సన్నాహాలు చేస్తున్నది. గంభీరావుపేట మండలం నర్మాలలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అందుబాటులోకి రానున్నది. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీతో మల్కపేట, అన్నపూర్ణ రిజర్వాయర్లను కట్టించారు. ఎదురెక్కిన గోదావరి జలాలతో వందలాది మంది మత్స్య కార్మికులకు ఉపాధి లభించింది. చీర్లవంచలో అతిపెద్ద ఆక్వాహబ్ పరిశ్రమ, యూనివర్సిటీలు.
ధాన్యాగారాలు, మోడ్రన్ రైతు బజార్తోపాటు రూ.1,500 కోట్లకు పైగా నిధులు వెచ్చించారు. రాష్ట్రంలోనే సిరిసిల్లను నంబర్వన్గా అభివృద్ధి చేశారు. అన్నదాతలు, నేతన్నల ఆత్మహత్యలు, ఆకలిచావులతో తల్లడిల్లిన సిరిసిల్లను ‘సిరు’ల ఖిల్లాగా చేసిన కేటీఆర్కే ఈ ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తమ నాయకుడిని వదులుకోలేదు. కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలకు తలవంచలేదు. చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉంటారని సిరిసిల్ల ప్రజలు నిరూపించారు.