Koppula Eshwar | ధర్మారం, సెప్టెంబర్ 20 : ప్రజా మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ను బదనాం చేయడానికి కక్షపూరితంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఆవరణలోని వ్యవసాయ భూమిలో ఇంచు ప్రభుత్వ భూమి తేలకుంటే తప్పు ఒప్పుకొని రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా.. అని రాష్ట్ర మాజీ మంత్రి, రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఘాటుగా ప్రశ్నించారు. ఈ మేరకు పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ఆదివారం పర్యటించి గణపతి మండపాలను సందర్శించారు. అనంతరం స్థానిక గణేష్ నగర్ లో మీడియాతో ఈశ్వర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రధాన నేతలైన మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న కక్షపూరిత చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి నష్టం కలిగించే విధంగా 22ఏను తీసుకువచ్చి లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తయని అసెంబ్లీలో ప్రశ్నించిన బీఆర్ఎస్ పై రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశ పూరితమైన చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు.
22 ఏ నిషేధిత జాబితాలో భూములు చేర్చడం వల్ల తప్పు జరిగిందని స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. 22ఏ ను సరిదిద్దాల్సింది పోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్ ల పై అధికార పార్టీ ఎంపీలు, నాయకులు సందర్శన ఇందుకు నిదర్శనమని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోని వ్యవసాయ క్షేత్రంలో అసైన్డ్ భూమి ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఇంచు ప్రభుత్వ భూమి తేలనిపక్షంలో దానికి బాధ్యత వహించి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాస్తాడా అని ఈశ్వర్ ప్రశ్నించారు. కేసీఆర్ కు ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లో కేవలం 62 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉండగా ఆయన అక్కడ వ్యవసాయం చేస్తూ పంటలు పండిస్తూ ఉంటే దానికి విరుద్ధంగా రూ.లక్ష కోట్ల విలువైన 1,000 ఎకరాల భూమి ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఏమిటని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ పలుమార్లు ప్రజా మద్దతుతో ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎంగా, కేంద్ర మంత్రి హోదాలో పనిచేసిన గొప్ప నాయకుడని అలాంటి తమ నేత ప్రభుత్వ అసైన్డ్ భూమిని ఆక్రమించే ప్రసక్తే లేదని ఆయన నీతిగా నిజాయితీగా పట్టా భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నాడని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి పార్టీలో ప్రధాన నేతలుగా ఉన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పై కావాలని అసైన్డ్ భూములను ఆక్రమించారని ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వ భూమి అని తేల్చడానికి అధికార యంత్రంగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ ఎంపీలు ,మంత్రులను ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫామ్ హౌస్ ల సందర్శనకు పంపడం ఏమిటని ఈశ్వర్ నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ప్రభుత్వంలో కొనసాగుతున్న పలువురు మంత్రులు సంపాదన కోసమే హోదాలో ఉన్నారని వారు ఎన్నో అక్రమ ఆస్తులు కూడా పెట్టుకున్నారని ఈశ్వర్ ఆరోపించారు. కానీ మాజీ సీఎం కేసీఆర్ నిబద్ధతతో ప్రజా మద్దతుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజల సంక్షేమం తో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టారని ఆయన గుర్తు చేశారు. కానీ అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పదవులు కొనసాగుతూ ప్రతిపక్ష పార్టీపై దురుద్దేశపూరితమైన కక్ష సాధిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ఎవరికి ఉండే ఆస్తులు వారికి ఉంటాయని విషయం రేవంత్ రెడ్డికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. పారదర్శకంగా పాలన చేయాల్సింది పోయి గిన్నిస్ రికార్డు లోకి ఎక్కేంత అబద్ధాలు రేవంత్ రెడ్డి మాట్లాడాలని ఆయన ఆరోపించారు.
తాను రూ.150తో ఎర్ర బస్సు ఎక్కి రాజధానికి వచ్చానని గతంలో ప్రకటించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు వందల ఎకరాల భూములు ఎలా వచ్చాయని ఈశ్వర్ ప్రశ్నించారు .రేవంత్ రెడ్డి పాలనలో రైతు బంధు, రైతు బీమా, గురుకుల విద్యాలయాల నిర్వహణ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తదితర పథకాలన్నీ నిర్వీర్యమైనాయని ఆయన స్పష్టం చేశారు. ఇక దేశంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయపరంగా బద్ధ శత్రువులైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఈశ్వర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో ఎన్ని లోపాలున్నా బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించరని ఆయన పేర్కొన్నారు. ప్రతీ దానికి ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ పైనే అనవసరపు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతూ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, పార్టీ ధర్మారం పట్టణ మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.