Houthis warning : యెమెన్ (Yemen) కు చెందిన హౌతీ రెబల్స్ (Hauti Rebels).. పాకిస్థాన్ (Pakistan), టర్కీ (Turkiye) దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అరేబియా (Saudi Arabia) కు మద్దతుగా సైనిక బలగాలను పంపినా లేదా ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నా ‘ఉక్కు పిడికిలి’ తో బదులిస్తామని స్పష్టంచేశారు. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ మధ్య ఇటీవల కుదిరిన త్రైపాక్షిక రక్షణ ఒప్పందం నేపథ్యంలో ఈ హెచ్చరికలు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
హౌతీ అన్సార్ అల్లా పొలిటికల్ బ్యూరో సభ్యుడు మహ్మద్ అల్-బుఖైతీ ఇటీవలి ఇంటర్వ్యూలలో ఈ హెచ్చరికలు చేశారు. ‘దేవుడి సాక్షిగా చెబుతున్నా. ఒకవేళ పాకిస్థాన్, టర్కీ ఈ యుద్ధంలో జోక్యం చేసుకుంటే, మేము వారిపై ఉక్కు పిడికిలితో విరుచుకుపడతాం’ అన్నారు. సౌదీ అరేబియాకు బుద్ధి చెబుతున్నట్లే, ఆ రెండు దేశాలకు కూడా క్రమశిక్షణ నేర్పుతామని వ్యాఖ్యానించారు. తాము సౌదీ నేతృత్వంలోని సైనిక చర్యలు, ఆర్థిక దిగ్బంధనానికి వ్యతిరేకంగా ఆత్మరక్షణ పోరాటమే చేస్తున్నామని బుఖైతీ పునరుద్ఘాటించారు.
పాకిస్థాన్, టర్కీ ప్రభుత్వాలు ఈ వివాదంలో తటస్థంగా ఉండాలని, తమ సరిహద్దులకు సంబంధంలేని యుద్ధంలో తలదూర్చవద్దని ఆయన సూచించారు. ఆగస్టు 7న సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీలు ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’ పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏ ఒక్కరిపైన దాడి జరిగినా దానిని ముగ్గురిపై జరిగిన దాడిగా పరిగణిస్తారు. ఈ ఒప్పందం కింద సౌదీ భూభాగాన్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టర్కీ కూడా సౌదీకి అవసరమైన సైనిక, సాంకేతిక సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది.
సౌదీలోని ఇంధన వనరులు, ప్రధాన నగరాల సమీప ప్రాంతాలపై హౌతీలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు తీవ్రతరం చేసిన తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ కొత్త రక్షణ ఒప్పందం కింద విదేశీ బలగాలను యెమెన్లో మోహరించినట్లు ఇంకా అధికారికంగా ధ్రువీకరణ కాలేదు.