రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం
సమ్మెకు కూడా వెనుకాడబోం
టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్
గోదావరిఖని, జూన్ 27: సింగరేణిలో ప్రైవేటీకరణ జరుగకుండా అడ్డుకుని తీరుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్ స్పష్టం చేశారు. టీబీజీకేఎస్ సెంట్రల్ ఆఫీస్ బేరర్స్ ముఖ్య నాయకుల సమావేశం గోదావరిఖనిలోని ఇల్లందు గెస్ట్హౌస్లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సింగరేణిలో ప్రైవేటీకరణ జరుగకుండా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు అవసరమైతే సమ్మెకు వెళ్తామని వివరించారు.
35 నుంచి 40 ఏండ్ల వయో పరిమితి కచ్చితంగా తొందరలోనే చేస్తామని, మారుపేర్ల విషయమై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్యతోపాటు అన్ని ఏరియాల ఉపాధ్యక్షులు, కేంద్ర కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.