కరీంనగర్/ రాజన్నసిరిసిల్ల/ జగిత్యాల/ పెద్దపల్లి జూలై 19(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి ప్రారంభమైన వానలు మంగళ, బుధ వారాల్లోనూ ఎడతెరిపిలేకుండా పడుతున్నాయి. ఇన్నాళ్లు చినుకు కరువై వడలిపోయిన పంట చేన్లకు జీవం పోస్తున్నాయి. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం కావడంతో రైతులు సైతం సంతోషంలో మునిగితేలుతున్నారు. మరో నాలుగురోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో బుధవారం ఉదయం వరకు సగటున 17.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గంగాధర, చొప్పదండి, హుజూరాబాద్లో అధికంగా 68.6 నుంచి 65.2 మిల్లీ మీటర్ల అధిక వర్షం కురిసింది.
సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గన్నేరువరం, కరీంనగర్, మాన కొండూర్ మండలాలు మినహాయిస్తే మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామునుంచి ఎడతెరిపిలేని వాన పడుతున్నది. జిల్లాలో 9.9మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిరిసిల్ల పాతబస్టాండ్, సంజీవయ్యనగర్ ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మద్దిమల్ల, రాయిని చెరువు, అడవిపదిర, ధర్మారం చెరువుల్లో వరదనీరు చేరింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం వరకు సగటున 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మేడిపల్లిలో 38 మిల్లీమీటర్లు, సారంగాపూర్లో 35.8 ్ల, మల్యాల మండలం మద్దుట్లలో 35.5, అత్యల్పంగా మల్లాపూర్లో 4.5 మిల్లీమీటర్లు, రాయికల్లో 4.0, ఇబ్రహీంపట్నం మండలం గోధూర్లో 3.0, మల్లాపూర్ మండలం రాఘవపట్నంలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నది. శ్రీరాంపూర్ మండలంలో అత్యధికంగా 21.9 మిల్లిమీటర్లు, ధర్మారంలో 18.2 వర్షపాతం రికార్డయింది. అత్యల్పంగా రామగుండంలో 5.4 మిల్లీమీటర్లు, కమాన్పూర్లో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.