కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 2: రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరిస్తున్న దరఖాస్తు ఫారాల్లో బ్యాంకు అకౌంట్ వివరాలు అడుగకపోవడంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో బ్యాంకు అకౌంట్ అడగకపోవడంతో ప్రజలు సందేహపడుతున్నారన్నారు. సంక్షేమ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు ఫాంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేస్తున్నారని, మరి బ్యాంకు అకౌంట్నంబర్ గురించి ఎలాంటి సమాచారం అడుగకపోవడంలో అంతర్యమేమిటనన్నారు. బ్యాంకు అకౌంట్ కోసం మళ్లీ గ్రామసభలు నిర్వహిస్తారా..? చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో బ్యాంకు అకౌంట్ లేకుండా లబ్ధిదారులకు ఎలా సంక్షేమ పథకాల డబ్బులు చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుతో ప్రజలు ఆగమవుతున్నారని, దీనిపై స్పందించాలని కోరారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జకుల నాగరాజు, బీఆర్ఎస్ నాయకుడు బైరం పద్మయ్య, హైమద్, దూలం సంపత్ గౌడ్, సాయికృష్ణ, వినోద్ పాల్గొన్నారు.