Attempt Murder | పెద్దపల్లి కమాన్/కాల్వ శ్రీరాంపూర్, ఫిబ్రవరి 21: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒళ్లు గగుర్పొడిచే ఘాతుకం చోటుచేసుకుంది. ఐదేళ్లుగా సాగుతున్న విడాకుల కేసు చివరకు హత్యాయత్నానికి దారితీసింది. భార్య చనిపోయిందని భావించి పొదల్లో పడేసిన భర్తకు పోలీసులు షాకిచ్చారు.
స్థానికుల కథనం ప్రకారం.. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామనికి చెందిన నూనె వెంకటేష్, పద్మ దంపతుల మధ్య గత ఐదేళ్లుగా కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది. గురువారం కోర్టు వాయిదా ఉండటంతో ఇద్దరూ పెద్దపల్లి కోర్టుకు వచ్చారు. కోర్టు పని ముగిశాక, ‘రా మాట్లాడుకుందాం’ అని నమ్మబలికి పద్మను తన బైక్పై వెంకటేష్ ఎక్కించుకున్నాడు.
ఆమెను నిర్మానుష్య ప్రాంతమైన జాఫర్ ఖాన్ పేట గుట్టల వద్దకు తీసుకెళ్లి, కోపంతో ఊగిపోయిన వెంకటేష్.. బండరాయితో పద్మ తలపై బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె స్పృహ కోల్పోవడంతో, చనిపోయిందని నిర్ధారించుకుని సమీపంలోని పొదల్లో పడేసి పరారయ్యాడు. పద్మ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెద్దపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేష్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. కాగా ‘పద్మను తానే చంపేసి పొదల్లో పడేశాను’ అని నేరం ఒప్పుకున్నాడు. మృతదేహం కోసం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా అక్కడ అసలైన ట్విస్ట్ ఎదురైంది. రక్తపు మడుగులో పడి ఉన్న పద్మ, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించడంతో పోలీసులు వెంటనే ఆమెను పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు . ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స అందుతోంది. నిందితుడు వెంకటేష్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.