కమాన్చౌరస్తా, ఆగస్టు 15 : కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి వీకెండ్ మస్తీ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తన కుటుంబ సభ్యులతో పాటు, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయుడు, మేయర్ వై సునీల్రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వంతెనపై నిర్వహించిన కార్యక్రమాలు నగరల వాసులను ఉర్రూతలూగించాయి. ఇందులో భాగంగా యాంకర్ చంచల్ శర్మ వ్యాఖ్యానం ఆకట్టుకోగా సంగెం రాధాకృష్ణ బాలభవన్ విద్యార్థులు నృత్య ప్రదర్శనతో అలరించారు. అనంతరం జుగులర్, ఐరా బృంద ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా క్రాకర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రమంలో తీగల వంతెనపై 16 ఫులడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా, పెద్ద సంఖ్యలో నగరవాసులు హాజరై ఆస్వాదించారు. అయితే, రాత్రి 10 దాటినా తీగల వంతెనపై జనం సందడి తగ్గలేదు. కాగా, 12 గంటల వరకు కార్యక్రమాలు కొనసాగాయి.
జిల్లా వాసిగా గర్వంగా ఉంది : సినీ హీరో సోహెల్
కరీంనగర్ జిల్లా వాసిగా ఇక్కడ జరుగతున్న అభివృద్ధిని చూడడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో గర్వంగా కూడా ఉన్నదని బిగ్బాస్ ఫేం, సినీ హీరో సోహెల్ అన్నారు. వీకెండ్ మస్తీ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన ఆయన మాట్లాడుతూ, 18వ తేదీన విడుదలవుతున్న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాను జిల్లా వాసులు ఆదరించాలని కోరారు. ఇక్కడ సినిమా హిట్ అయితే, రాష్ట్ర వ్యాప్తంగా హిట్ అవుతుందని ఆకాంక్షించారు.
అన్ని హంగులతో నగరాభివృద్ధి: మంత్రి గంగుల
హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్ అని, అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ఇక్కడా జరిగేలా నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణలో కరీంనగర్ను రెండో స్థానంలో నిలుపాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నామన్నారు. వందలాది కోట్ల నిధులతో ఇప్పటికే కరీంనగర్ రూపు రేఖలు మార్చామని, చాలా రోజుల తర్వాత కరీంనగర్ వచ్చిన వారు ఇకడ జరిగిన అభివృద్ధిని చూసి ఆశ్చర్య పోతున్నారన్నారు. మూడు నెలల్లో మానేరు రివర్ఫ్రంట్ మొదటి దశ పనులు పూర్తి చేస్తామని, ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
ఇందులో ప్రపంచంలోనే అధునాతనమైన థీమ్ పార్లు, బోటింగ్, పౌంటేన్లు రానున్నాయన్నారు. ఈ పౌంటేన్ ప్రపంచంలో మూడోది అని, దీన్ని రూ.75 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో మొదటిది సింగపూర్లోని సియోల్ యోసో, రెండోది చైనాలో, మూడోది మన కరీంనగర్లో ఉండనున్నదన్నారు. దీని కోసం ఇటీవల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి సియోల్ వెళ్లి పరిశీలించి వచ్చినట్లు చెప్పారు. ఈ పౌంటేన్ భూమి నుంచి 100 అడుగుల ఎత్తులో ఉంటుందని, ఇందులో నీరు, ఫౌర్, సినిమా సైతం చూసే అవకాశం ఉటుందన్నారు. దీని కోసం సందర్శకుల తాకిడి ఉన్న క్రమంలో ప్రతి వారం కార్నివాల్లా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. మూడు నెలల వరకు ప్రతి శని, ఆదివారాల్లో వీకెండ్ మస్తీ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్నివాల్లో భాగంగా ఫుడ్ స్టాల్స్, కిడ్స్ గేమ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయన్నారు.