కార్పొరేషన్/తిమ్మాపూర్రూరల్, జనవరి 11: కరీంనగర్ శివారులో మానేరు నదిలో చేపట్టనున్న మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్)ప్రాజెక్టు జిల్లాకే మణిహారంగా నిలువబోతున్నదని, అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. మంగళవారం మధ్యాహ్నం ఎంఆర్ఎఫ్ నిర్మాణ పనులపై ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, నీటిపారుదల, టూరిజం శాఖల అధికారులతో కలిసి ఎల్ఎండీ కట్టపై గెస్ట్హౌస్లో సమీక్షించారు. రివర్ ఫ్రంట్కు ఎంత స్థలం తీసుకోవాలి? ఏ విధంగా డిజైన్ చేయాలి? అనే అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం మానేరు గేట్లను పరిశీలించి, నీటిమట్టాన్ని చూశారు. సాయంత్రం డ్యాం పై నుంచి, అలాగే కేబుల్ బ్రిడ్జి పై నుంచి మానేరు నదిలో ప్రాజెక్టుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
త్వరలోనే టెండర్లు
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరీంనగరాన్ని సుందరంగా, పర్యాటకంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి గంగుల పేర్కొన్నారు. కేసీఆర్ కరీంనగర్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పటికే స్మార్ట్సిటీగా ఎంపిక చేయడంతో పాటు ప్రత్యేక నిధులు మంజూరు చేశారని తెలిపారు. హైదరాబాద్, వరంగల్ నుంచి నగరానికి వచ్చే వారికి నగర ముఖద్వారం వద్ద అద్భుతమైన ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇరిగేషన్ నుంచి రూ.310 కోట్లు, టూరిజం శాఖ నుంచి రూ.100కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మొదటి దశలో 3.75 కిలోమీటర్ల మేర, రెండో దశలో 6.25 కిలోమీటర్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఢిల్లీకి చెందిన ఐఎన్ఎస్ కన్సల్టెన్సీ ద్వారా డిజైన్లను సిద్ధం చేశామన్నారు. ఎంఆర్ఎఫ్కు ఇరువైపులా పారులు, వాటర్ పౌంటేన్లు, థీమ్ పారులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ పౌంటేన్లు, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తామని తెలిపారు. రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్ల ద్వారా ప్రయాణం పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుందని చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ ప్రాజెక్టు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అతి త్వరలోనే కేబుల్ బ్రిడ్జిని కూడా అందుబాటులోకి తెస్తామని, డైనమిక్ లైటింగ్ పనులు చివరి దశకు వచ్చాయని చెప్పారు.
వచ్చే రెండేళ్లల్లో ప్రాజెక్టు పూర్తికి కృషి: రజత్కుమార్
రివర్ ఫ్రంట్కు టెండర్లను వీలైనంత త్వరగా పూర్తిచేసి, వచ్చే రెండేళ్లలోపు మొదటి విడుత పనులను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ తెలిపారు. రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణంగా మానేర్ రివర్ ఫ్రంట్ నిలుస్తుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు మానేర్ రివర్ ఫ్రంట్ ముఖద్వారంగా నిలుస్తుందని చెప్పారు. అహ్మదాబాద్లోని సబర్మతి ప్రాజెక్టు కంటే అద్భుతంగా నిర్మిస్తామని ఉద్ఘాటించారు. ఇంకా దేశంలో ఎకడా లేనివిధంగా జిల్లాలో 147 టీఎంసీల నీటి ప్రాజెక్టులు ఉన్నాయని, దీంతో ఈ ప్రాంతం జియోగ్రఫీగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 638 చెక్డ్యాంలు గ్రౌండింగ్ అయ్యాయని, అత్యధిక నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. వీటి వల్ల ఇప్పటికే 5 మీటర్ల మేరకు భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ఒక మీటరు భూగర్భ జలం 100 టీఎంసీలతో సమానమని చెప్పారు. మరో 500 చెక్డ్యాంల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఈఎన్సీ మురళీధర్రావు మాట్లాడుతూ ఒక నగరంలో ఇలా డ్యాం ఉండడం దేశంలో ఎక్కడా లేదని, ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇక్కడ కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఈఎన్సీ శంకర్, టూరిజం ఎండీ మనోహర్ రావు, ఈడీ శంకర్ రెడ్డి, ఐఎన్సీ కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.