జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 5: జగిత్యాల టౌన్ను మోడల్గా మారుస్తామని, పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో రూ.41 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేసి, మాట్లాడారు. 1989 మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ధరూర్ క్యాంప్ హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేశామని, జగిత్యాలకు ఒక మోడల్ కాలనీగా ధరూర్ క్యాంప్ నిలుస్తున్నదని చెప్పారు. అలాగే జగిత్యాల పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
పట్టణంలో రూ.4 కోట్లతో 77 పనులు జరుగుతున్నాయని, మరో రూ.11 కోట్లతో వారంలో పనులకు భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. జగిత్యాల పట్టణంలో రూ.10 కోట్లతో ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని, ఇల్లు లేని పేద, మధ్య తరగతి ప్రజల కోసం 4500 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. గతంలో ధరూర్ క్యాంప్లో నిరుపయోగంగా ఉన్న 5 లక్షల లీటర్ల ట్యాంక్ను నేడు ఉపయోగంలోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ వొద్ది శ్రీలత, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, క్యాంప్ రామాలయం చైర్మన్ బ్రహ్మండబేరి నరేశ్, యూత్ అధ్యక్షుడు గిరి, కమిషనర్ నరేశ్, డీఈ రాజేశ్వర్, ప్యాక్స్ చైర్మన్ సాగర్ రావు, ఎంపీటీసీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.