Rewa | జగిత్యాల : 2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలు వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆధ్వర్యంలో బుధవారం జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు రిటైర్డ్ ఉద్యోగులు నిరసన తెలిపి అనంతరం కలెక్టరెట్ ఏ ఓ కు వినతిపత్రం అందజేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చంద్రమౌళి, ఉపాధ్యక్షులు గద్ద జగదీశ్వర చారి మాట్లాడుతూ ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ విరమణ చెందిన ఉద్యోగులకు రావలసిన జిపిఎఫ్, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ అందలేదని అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత వెంటనే రావాల్సిన బకాయిలు అందక పెన్షనర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు.
ఈ విషయమై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పెడచెవినపెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎన్నం రాంరెడ్డి మాట్లాడుతూ పెన్షన్ బకాయిలు రాక ఇప్పటివరకు రాష్ట్రంలో 16 మంది పెన్షనర్లు చనిపోయారని చాలామంది అనారోగ్యంతో హాస్పిటల్లో డబ్బులు కట్టలేని పరిస్థితిలో దీనావస్థలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెన్షన్లకు రావాల్సిన బకాయిలను ఏక మొత్తంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్గనైసింగ్ కార్యదర్శి మామిడాల లక్ష్మి నారాయణ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ బకాయిలు వచ్చేంతవరకు పోరాటం చేయాలని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేద్దామని అన్నారు.
కోశాధికారి కనపర్తి దివాకర్ మాట్లాడుతూ బకాయిలు రాక పెళ్లిళ్లు చేయలేక, ఇల్లు కట్టుకోలేక అనారోగ్యంతో బాధపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐల్నేని నరేందర్ రావు, వెంకటరమణ, నసీం అహ్మద్ కటకం ప్రభు,కరుణశ్రీ,రాందాస్, వేణుగోపాల్, విమల, చంద్రమౌళి,చంద్రశేఖర్, దుబ్బయ్య,మదన్ మోహన్ రావు,బాజోజి శ్రీనివాస్, పిన్నంశెట్టి శ్రీనివాస్,మోర గోవర్ధన్,అందే శ్రీనివాస్ బాదం పురుషోత్తం,సత్యనారాయణ రావు, శంకరయ్య, పోచయ్య, ఉదయ్ భాస్కర్,ప్రతాప్,శ్రీపాద వెంకటరమణ,చింతల రవీందర్ రెడ్డి,వై రవీందర్,దొడ్డ సత్యనారాయ, మురళి కృష్ణ,రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.