కార్పొరేషన్, డిసెంబర్ 4: కరీంనగర్కు నలువైపులా నిర్మిస్తున్న సమీకృత మార్కెట్లలో మూడింటిని మార్చి 31వ తేదీలోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట చేపట్టిన సమీకృత మారెట్ నిర్మాణ పనులను ఆదివారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, సమీకృత మారెట్ల ఏర్పాటుతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో పాటు ప్రజలకు అన్ని రకాల వస్తువులు ఒకే చోట దొరకుతాయన్నారు. ప్రజలకు అనుకూలంగా ఉండేలా రూ.40 కోట్లతో నగరానికి నాలుగు వైపులా సమీకృత మారెట్లు సకల హంగులతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. పూలు, పండ్లు, కూరగాయలు, మాంసం లాంటి అన్ని మార్కెట్లు ఒకే చోట అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మారెట్కు వచ్చే ప్రజల కోసం పారింగ్ సౌకర్యం, తాగునీటి వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. సమీకృత మార్కెట్లలో సుమారు 2000 మందికి పైగా వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వీలు ఉంటుందన్నారు.
వీటితో పాటు ఇప్పటికే నగరంలో ఏర్పాటు చేస్తున్న వెండింగ్ జోన్లలో మరో 800 నుంచి 1000 మందికి అవకాశం ఉంటుందన్నారు. మొత్తంగా నగరంలో 3 వేల మంది సమీకృత మార్కెట్లు, వెండింగ్ జోన్లలో వ్యాపారాలు చేసుకోవడానికి వీలు ఉంటుందన్నారు. దీంతో నగరంలో ఎక్కడా కూడ రోడ్లపై వ్యాపారాలు సాగకుండా చూస్తామన్నారు. వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ప్రత్యామ్నాయం చూపించాలన్న ఉద్దేశంతో మార్కెట్లు నిర్మిస్తున్నామని, వీటిలో అందరికీ అవకాశం ఉంటుందన్నారు.
నగరంలో ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 2 వేల మందికిపైగా వీధి వ్యాపారులు ఉన్నారని, వీరందరికీ ఈ మార్కెట్లలో అవకాశం కల్పిస్తామన్నారు. మార్కెట్ల నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, కుర్ర తిరుపతి, నేతికుంట యాదయ్య, నగరపాలక సంస్థ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.