KTR | గోదావరిఖని : తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి పార్టీ అధినేత కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా ప్రతీ నాయకుడు సమన్వయంతో పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) స్పష్టం చేశారు. హైదరాబాదులోని కేసీఆర్ నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రామగుండం నియోజకవర్గ ముఖ్య నేతలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీనియర్ నాయకులు కౌశిక హరి, వ్యాళ్ల హరీష్ రెడ్డితో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో నెలకొన్న అంతర్గత విభేదాలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో గ్రూపు రాజకీయాలకు పూర్తిగా స్వస్తి పలికి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని కేటీఆర్ స్పష్టంగా ఆదేశించారు.
అలాగే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం నెలకొల్పి పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. రానున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రామగుండం నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, నాయకులందరూ ఒకే వేదికపై పనిచేయడం ద్వారా కేడర్లో నూతన ఉత్సాహం నింపాలని సమావేశంలో కేటీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇంచార్జి కోరుకంటి చందర్ తెలిపారు.