వీఆర్ఏల స్వప్నం నెరవేరింది. సరైన గుర్తింపు లేక.. చాలీచాలని వేతనంతో సతమతమవుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు రాష్ట్ర సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జీవితాలకు భరోసా దొరికింది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పే స్కేల్, అర్హతలను బట్టి వివిధ శాఖల్లో పోస్టింగులు, 61 ఏండ్లు దాటిన వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి కొలువు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం, వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేయడంపై ఆనందం ఉప్పొంగుతున్నది. తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,330 మందికి మేలు కలుగనుండగా, మంగళవారం ఊరూరా సంబురాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని, ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేసి మంచి పేరు తెచ్చుకుంటామని ముక్తకంఠంతో చెప్పారు.
కరీంనగర్, జూలై 25 (నమస్తే తెలంగాణ) : వీఆర్ఏల్లో ఆనందం ఉప్పొంగుతున్నది. ఏండ్లనాటి కల.. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పే స్కేల్ స్వప్నాన్ని సీఎం కేసీఆర్ నెరవేర్చగా, సంతోషం వెల్లివిరుస్తున్నది. ఉద్యోగాల క్రమబద్ధీకరణ, పే స్కేల్, అర్హతలను బట్టి వివిధ శాఖల్లో పోస్టింగులు, 61 ఏండ్లు దాటిన వారి కుటుంబసభ్యుల్లో ఒకరికి కొలువు ఇస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేయడంపై సంబురపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కరీంనగర్ జిల్లాలో 560, పెద్దపల్లి 491, జగిత్యాల 811, సిరిసిల్ల 468 మందికి మొత్తం.. ఉమ్మడి జిల్లాలో 2,330 మందికి లబ్ధి కలుగనుండగా, మంగళవారం ఊరూరా సంబురాలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, చొప్పదండి, రామడుగు, గన్నేరువరం, చిగురుమామిడి, మానకొండూర్, శంకరపట్నం, సైదాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, రుద్రంగి, జగిత్యాల జిల్లా ధర్మపురి, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెద్దపల్లి జిల్లా రామగిరి, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్, ముత్తారం తదితర మండలాల్లో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఇన్నాళ్లు తాము పడిన శ్రమకు, చేసిన విజ్ఞప్తులకు గుర్తింపు వచ్చిందని వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం గొప్పమనసుకు ధన్యవాదాలు
వీఆర్ఏ వ్యవస్థ ఈనాటిది కాదు. నూటయాభై ఏండ్ల నుంచి, నిజాం ప్రభుత్వం నుంచి ఉన్నది. గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా మొదట పట్వారినే పిలిచేది. అలాగే ఏ అధికారి వచ్చినా సుంకరే పనిచేసేది. జీతం భత్యం లేకుండా తరాలకు తరాలు రెవెన్యూ వ్యవస్థకు సేవ చేస్తూ వచ్చాం. మా పూర్వీకులతోపాటు మేమూ వెట్టిచాకిరీ చేస్తూ వచ్చాం. మాసేవకు రూపం లేదు. మా జీతాలు, జీవితానికి రూపం లేదు. సుంకరి వ్యవస్థను స్థిరీకరించి వేతనాలు, విధి విధానాలు కల్పించాలని దశాబ్దాల నుంచి డిమాండ్ చేస్తూ వచ్చాం. ఏ ప్రభుత్వం మమల్ని పట్టించుకోలేదు. అయినా వృత్తిని మానేయలేక విధుల్లో కొనసాగుతూ వచ్చాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ మాకు మేలు చేశారు. వేతనాలు పెంచారు. అన్నివర్గాలకు న్యాయం చేసిన ఆయన, మాకూ న్యాయం చేస్తాడన్న నమ్మకం ఏర్పడింది. సీఎం సైతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చెప్పినట్టుగానే వీఆర్ఏల క్రమబద్ధీకరించడంతోపాటు పేస్కేల్ను వర్తింపజేసి, క్యాడర్ను సైతం కల్పించాలని నిర్ణయించారు. దీంతో వేలాది కుటుంబాలకు మేలు జరిగింది. ఇది మా అదృష్టం. ఆయన పెద్ద మనసుకు ధన్యవాదాలు. మా వీఆర్ఏల లోకం అంతా ఆయనకు రుణపడి ఉంటుంది.
– ద్యాగల గంగారాం, వీఆర్ఏల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు (జగిత్యాల)
మా కల నెరవేరింది
ఏండ్లనాటి మా కల నెరవేరింది. ప్రభుత్వం మా సేవలను గుర్తించి ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం, పే స్కేల్ వర్తింపజేయడం ఆనందంగా ఉంది. నేను సారంగాపూర్ మండలం కోనాపూర్ వీఆర్ఏగా పని చేస్తున్న. 2015లో మా నాన్న పోశాలు ఉద్యోగం నాకు వచ్చింది. మిగతా ఉద్యోగులతో సమానంగా పనిచేసినా గుర్తింపు లేక, వేతనం సరిపోక చాలా ఇబ్బందులు పడ్డం. కానీ మంత్రి కేటీఆర్ బర్త్డే గిఫ్టుగా మాకు పేస్కేల్ ఇచ్చినందుకు రుణపడి ఉంటాం. మా సమస్యల పరష్కారానికి కృషి చేసిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు రుణపడి ఉంటాం.
– పంగ రాజేశం, వీఆర్ఏల జేఏసీ మండలాధ్యక్షుడు (సారంగాపూర్)
జీవితాంతం రుణపడి ఉంటం
వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించి, మమ్మల్ని ప్రభుత్వోద్యోగులుగా మార్చిన సీఎం కేసీఆర్ సార్కు మేమెంతో రుణపడి ఉంటం. వీఆర్ఏ వ్యవస్థనే మొత్తంగా రద్దు చేసిన దృష్ట్యా, మమ్మల్ని ఏ డిపార్ట్మెంట్లో సర్దుబాటు చేసినా, విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నం. ఈ ఉద్యోగం ఉంటుందా..? ఊడుతుందా..? అనే సంశయంతో ఉండుంటిమి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మాకు ధీమాను కల్పించిన కేసీఆర్ సార్ ఇపుడు మాకు దేవుడు. మానెత్తిన పాలు పోసిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– కే శ్రీనివాస్, వీఆర్ఏ (కొత్తపల్లి)
మాకు ప్రత్యక్ష దైవం కేసీఆర్ సార్
ఇన్ని రోజులు అరకొర జీతాలతో అవస్థలు పడ్డం. మాలాంటి చిన్న స్థాయి ఉద్యోగులకు పేస్కేల్ ఇచ్చి మంచి ఉద్యోగాలు ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్ మా కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచిండు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని క్రమబద్ధీకరిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. గతేడాది ప్రకటించిండు, ఇపుడు ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇస్తున్నడు. ఇన్నేళ్లు అధికారుల వద్ద ఊడిగం చేసినం. ఇక నుంచి మాతో వెట్టిచాకిరీ చేయించుకునే ప్రసక్తే లేదు. మమ్ములను క్రమబద్దీకరించి, మా కుటుంబాలకు పెద్దన్నగా మారిన సీఎం కేసీఆర్ సార్ మాకు ప్రత్యక్షదైవంగా మారిండు.
– తిరుపతి, కరీంనగర్ రూరల్
61 ఏండ్లు దాటిన వారి కుటుంబాలకు అవకాశం
వయోపరిమితి దాటిన వీఆర్ఏల స్థానంలో వారి కుటుంబసభ్యులకు అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్ మాపై చూపిన ఉదారతను తెలుపుతున్నది. ఇన్నేళ్లు రెవెన్యూ సహాయకులుగా పనిచేసిన వారిని తొలగిస్తే, మా కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారేది. దీనిని గమనించే సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. వారికి కూడా ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవడం చిరుద్యోగుల జీవన గమనంపై రాష్ట్ర ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధికి నిదర్శనం.
– ఎన్ స్వరూప, కొత్తపల్లి
మాకిచ్చిన మాట నిలబెట్టుకున్నరు
సీఎం కేసీఆర్ సార్ మాకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్వరాష్ట్రంలో ఉద్యోగులు ముఖ్యంగా మాలాంటి చిరుద్యోగులపై నిబద్ధతను చాటుకున్నారు. ఇది సీఎం కేసీఆర్ సార్తోనే సాధ్యమని మరోసారి నిరూపించుకున్నారు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న మాకు పేస్కేల్ వర్తింపజేయడంతో పాటు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించారు. విద్యార్హతలను బట్టి మాకు కేడర్ కూడా నిర్ణయించడం చాలా సంతోషం. సీఎం కేసీఆర్ సార్ దయతో ఇక నుంచి మా పిల్లలకు మంచి విద్యతో పాటు మా కుటుంబ పెద్దలను మంచిగా చూసుకునే అవకాశం కలిగింది. సీఎం చేసిన సాయానికి మేమెంతో రుణపడి ఉంటాం.
– జీ కోమల, కరీంనగర్ రూరల్
75 ఏండ్లల్లో ఎవరూ పట్టించుకోలేదు
మా వీఆర్ఏల వ్యవస్థ మొదలైనప్పటి నుంచి తరతరాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తున్నాం. 75ఏండ్లల్లో మమ్ముల పట్టిచ్చుకున్నోడు లేడు. మా కోసం ఓ పది నిమిషాలు ఆలోచించిన ముఖ్యమంత్రి లేడు. మంత్రి లేడు. అట్లాంటిది మా కష్టాలను, కన్నీళ్లను చూసిన సీఎం కేసీఆర్ మా కోసం ఒక రోజంతా కేటాయించిండు. మా గురించి ఆలోచించిండు. రాష్ట్రంలోని మా 21వేల కుటుంబాలను ఆదుకున్నడు. మాకు అన్నం పెట్టిండు. ఒక్క సంతకంతో మా కన్నీళ్లను తుడిచి, కష్టాలను దూరం చేసిండు. మేం సమ్మెకు దిగితే మంత్రి కేటీఆర్ సమస్య పరిష్కరిస్తానని చెప్పిండు. ముఖ్యమంత్రితో అసెంబ్లీ వేదికగా చెప్పించిండు. చెప్పినట్టే పెద్ద సారు మమ్ముల పర్మినెంట్ చేసిండు. సారుకు జీవితాంతం రుణపడి ఉంటం.
-పంగ శ్రావణ్, వీఆర్ఏ జేఏసీ జిల్లా కన్వీనర్ (పెద్దపల్లి)
మాపై రామన్న దయచూపిండు
మాతాతలు, తండ్రుల నుంచి తరతరాలుగా సేవలందిస్తూ వస్తున్నం. ఉద్యోగ భద్రత లేని మేం అనుక్షణం భయంతో బతికాం. ప్రభుత్వం ఏ పని చెప్పినా చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నాం. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని గత పాలకులకు మొరపెట్టుకున్నా కనికరించలేదు. మా మంత్రి రామన్నకు కలిసి విజ్ఞప్తి చేస్తే ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని సీఎం కేసీఆర్తో జీవో విడుదలయ్యేలా చొరవ తీసుకున్నడు. మాపై దయచూపినందుకు సంతోషంగా ఉంది. కేసీఆర్కు, రామన్నకు ఎప్పుడు రుణపడి ఉంటాం.
– పైండ్ల చందు, జిల్లా జేఏసీ చైర్మన్ (రాజన్న సిరిసిల్ల)
చాలా గొప్పవిషయం
వీఆర్ఏలను ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్ను వర్తింపజేయడం చాలా గొప్ప విషయం. దీనిని మేం ఊహించలేకపోతున్నాం. వీఆర్ఏలకు విద్యార్హతను బట్టి, క్యాడర్ను కల్పించాలనుకోవడం చాలా సంతోషం. నాలుగు శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేయడంతోపాటు వారికి అటెండర్, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లను ఇవ్వాలని నిర్ణయించడం సైతం గొప్పవిషయమే. వంశపారంపర్యంగా విధుల్లో చేరిన కొందరు పెద్ద మనుషులకు విద్యార్హతలు పెద్దగా లేవు. వంశపారంపర్యంగా వచ్చిన కొందరు యువకులకు విద్యార్హతలు ఉన్నాయి. ఇక రెగ్యులర్గా రిక్రూట్ అయిన వారిలో చాలా మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వారందరికీ మేలు చేస్తుంది. భవిష్యత్తులో వారు ఉన్నత క్యాడర్కు చేరుకునే అవకాశముంటుంది. ప్రతి వీఆర్ఏ కుటుంబం కేసీఆర్కు కృతజ్ఞతగా ఉంటుంది.
– తుమ్మల నాగరాజు, వీఆర్ఏ సంఘం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి (జగిత్యాల)
గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్
వంశపారంపర్యంగా ఇవ్వాల్సిన పోస్టును కొన్నేళ్లుగా ఇవ్వడం లేదు. దీంతో వయసు నిండిన కొందరు సుంకరుల పిల్లలకు వీఆర్ఏల పోస్టులు రాలేదు. దీంతో మేం కొన్నేళ్లుగా వీఆర్ఏలకు క్యాడర్ స్ట్రెత్, జాబ్చార్ట్, వంశపారంపర్యం పోస్టులు ఇవ్వాలన్న డిమాండ్తో ఉద్యమం చేస్తూ వచ్చాం. గతంలో ఏ ప్రభుత్వాలు మమల్ని పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మాత్రమే మా గురించి ఆలోచించారు. వీఆర్ఏలకు న్యాయం చేశారు. వంశపారంపర్యంగా విధుల్లో ఉండి, 61 ఏండ్లు నిండి పదవీ విరమణ చేసిన వారి పిల్లలకు సైతం ఉద్యోగం కల్పించాలని నిర్ణయించడం చాలా గొప్ప విషయం. ఈ నిర్ణయంతో చాలా మంది రిటైర్డ్ వీఆర్ఏల కుటుంబీకులకు మేలు జరుగుతుంది. అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అందరి కోసం ఆలోచించి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది.
– కోమల శంకర్, వీఆర్ఏ సంఘం జిల్లా కోశాధికారి (జగిత్యాల)
గొప్ప మనసు రామన్నది..
2017 నుంచి గ్రామ సహాయకుడిగా పనిచేస్తున్నా. నిన్నటి వరకు రూ.10వేల వేతనం వచ్చింది. కుటుంబ ఖర్చులకు సరిపోక చాలా ఇబ్బందులు పడ్డ. పిల్లల వైద్యం, ఇతరత్ర ఖర్చుల కోసం అప్పులైనయి. మా జాబ్ పర్మినెంట్ చేయాలని జేఏసీ పెట్టుకొని ఎన్నో ఉద్యమాలు చేసినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలే. మేమంతా మంత్రి కేటీఆర్ను కలిసి సమస్యలు చెప్పుకున్నం. ‘బాధెందుకు.. నేనున్న కదా’ అంటూ భుజం తట్టి భరోసా ఇచ్చిండు. ఆ భరోసాతో ఎన్నటికైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నం. మేం అనుకున్నట్టే మా ఉద్యోగాలు పర్మినెంట్ అయినయ్. రూ. పదివేలున్న జీతం రేపటి నుంచి రూ.25వేలకు పెరుగుతది. రామన్ననే మాకుటుంబానికి అండగా నిలిచిన దేవుడు.
– చిలువేరి ప్రవీణ్, వీఆర్ఏ జిల్లా జేఏసీ వైస్చైర్మన్ (రాజన్న సిరిసిల్ల)
మా జీవితాలకు కొత్త వెలుగు
మేం ప్రభుత్వానికి ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు దగ్గరగా ఉండి పనిచేస్తున్నాం. కానీ ఇన్నాళ్లు మా పనితీరును ఎవరూ గుర్తించలేదు. ఒక్క సీఎం కేసీఆర్ ఒక్కరు తప్ప. కడు పేదరికంలో మగ్గుతూ చాలీచాలని గౌరవ వేతనంతో బతుకుతున్న మాకు దారి చూపించారు. జీవితాలకు ఒక భరోసా ఇచ్చారు. భార్యాపిల్లలను సంతోషంగా పోషించుకునే ఉద్యోగాన్ని మాకు ఇచ్చిన ఆయన మేలు మేం మరువలేం. మంత్రి కేటీఆర్ చొరవ, సీఎం కేసీఆర్ దీక్షా దక్షతతోనే మాకు న్యాయం జరిగింది. వీఆర్ఏలుగా కొనసాగుతున్న మాకు మా విద్యార్హతను బట్టి అవకాశాలు ఇవ్వడం మా జీవితాలకు ఒక కొత్త వెలుగు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం, చిత్తశుద్ధి వల్లే సాధ్యమైంది. సీఎం కేసీఆర్కు మా వీఆర్ఏల కుటుంబాలు రుణపడి ఉంటాయి.
– బండారి వెంకటేశ్వర్లు, వీఆర్ఏ జేఏసీ చైర్మన్ (పెద్దపల్లి)