విఘ్నాలను నివారించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఆ గణనాథుడి నవరాత్రోత్సవాలకు వేళైంది. ఈ నెల 18 నుంచి వాడవాడలా మండపాలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరియనున్నది. ఈ నేపథ్యంలో కళాకారులు వినాయక విగ్రహాలను సిద్ధం చేయగా, ఉత్సవ కమిటీలు, భక్తుల కొనుగోళ్లతో పట్టణంలో సందడి వాతావరణం ఏర్పడింది.
– జమ్మికుంట, సెప్టెంబర్ 11
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 30 వార్డులు.. మండలంలోని 20 గ్రామ పంచాయతీలున్నాయి. ఏటా వినాయక చవితి సందర్భంగా పెద్ద విగ్రహాలే మూడు వేలకు పైగా మండప కమిటీల సభ్యులు కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లోనూ చిన్న, చిన్న గణేశుడి విగ్రహాలను భక్తులు పెట్టుకుంటారు. నవరాత్రులు పూజలు చేస్తారు. ఇలా ఆనవాయితీగా వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న విగ్రహాల తయారీదారులు మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. కొందరు స్థానిక కళాకారులు కూడా విగ్రహాల తయారీ పనులు నేర్చుకున్నారు. ఉపాధి పొందుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుతున్నారు. తయారు చేసిన విగ్రహాలను హోల్సేల్గా అమ్మకాలు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తయారీదారులే నేరుగా విక్రయాలకు దిగారు.
పెరిగిన దుకాణాలు
జమ్మికుంట పట్టణంలో గతంలో మూడు, నాలుగు చోట్ల మాత్రమే విక్రయాలు జరిగేవి. ఈ సారి 15 చోట్ల విగ్రహాలు అమ్మే దుకాణాలు వెలిశాయి. ఇక చవితికి రెండు రోజుల ముందైతే.. తెలంగాణ చౌక్ చుట్టూ బండ్ల మీద వందల కొద్దీ మట్టి విగ్రహాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన చిన్న విగ్రహాలు అమ్మకానికి పెడతారు. అయితే ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఒక్కో షాపులో రూ.20 నుంచి రూ.20వేల వరకు ధర పలికే విగ్రహాలు అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయి. చవితికి సమయం సమీపిస్తుండడంతో భక్తులు విగ్రహాలను కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. రంగురంగులు.. విభిన్న ఆకృతులతో మార్కెట్లో ఉన్న విగ్రహాలను ఎంపిక చేసుకుంటున్నారు.
15ఏళ్లుగా ఇదే పనిలో..
హైదరాబాద్లో విగ్రహాల తయారీ నేర్చుకున్న. 15ఏళ్లుగా ఇంటి వద్ద తయారు చేసుకుంటున్న. జమ్మికుంట, ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటున్న. ఉపాధి పొందుతూ మరికొందరికి పని కల్పిస్తున్న. గతంల విగ్రహాలు తయారు చేసే ముడి సరుకు ధర తక్కువుండే. ఇప్పుడు బాగా పెరిగింది. లాభం తక్కువైంది. ఒక్కో విగ్రహానికి మంచిగ అమ్మితే నలభై శాతం లాభం ఉంటుండే. తయారు చేసినవన్నీ అమ్మాలి. అప్పుడే ఎక్కువ లాభం. ఒక్కోసారి టైం దగ్గర పడుతుంటే తక్కువకు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది.
– కృష్ణ, కళాకారుడు(చిన్నకోమిటిపల్లి)
అమ్మకందార్లు పెరిగిన్రు
మేం పర్కాల దగ్గర విగ్రహాలు తయారు చేస్తం. అక్కడ, ఇక్కడ యేటా షాపు పెడ్తం. అమ్ముకుంటం. ఇంతకుముందు తక్కువ షాపులుండేవి. మంచిగ అమ్ముకునేటోళ్లం. లాభాలు కూడా బాగచ్చేవి. ఇప్పుడు షాపులు పెరిగినయ్. 15 చోట్ల అమ్ముతున్నరు. షాపులు పెరుగడంతోటి గిరాకీ తగ్గింది. లాభం కూడా ఉండకపోవచ్చు. కానీ ఏం చేద్దాం. ఇదే దందా చేస్తున్నం కదా. రకరకాల విగ్రహాలు తెచ్చినం. అమ్మకానికి పెట్టినం. భక్తులు వత్తన్రు. నచ్చింది చూసుకుంటున్రు. అడ్వాన్సులిత్తన్రు. పండుగ రోజు తీసుకపోతరు.
-సాయి, విగ్రహాల విక్రయదారుడు
మట్టి విగ్రహాలనే పూజించాలి
చిన్నవి మొదలు పెద్దపెద్ద విగ్రహాల దాకా తయారు చేసి అమ్ముతున్నరు. పైసలెన్నైనా భక్తులు కూడా కొంటున్నరు. మండపాల్ల, ఇంట్లో గణనాథుడిని పెట్టి కొలుస్తున్నరు. కానీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పుంటది. చెరువులల్ల వేయడం వల్ల జల కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తుతయ్. మట్టి విగ్రహాలనే తయారు చేయాలి. వాటినే పెట్టుకుని కొలువాలే. మా కమిటీ తరఫున మట్టి గణపతినే కొనుక్కున్నం. ఇళ్లల్లో కూడా మట్టి ప్రతిమలనే పూజించాలే.
-ముక్క వెంకన్న,
బాలగణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడు(జమ్మికుంట)