స్వరాష్ట్రంలో పల్లె దారులకు మహర్దశ పట్టింది. పట్టణాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల అభివృద్ధి జరుగుతున్నది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, తాజాగా 1.50కోట్లతో బోయినపల్లి మండలంలో బూరుగుపల్లి, కోరెం మీదుగా అనంతపల్లి దాకా చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణం చకచకా జరుగుతున్నది. పూర్తయితే రవాణా మెరుగుపడనుండగా, ఆయా గ్రామాల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
బోయినపల్లి, జనవరి 29: బోయినపల్లి మామిండ్ల వద్ద నుంచి బూర్గుపల్లి, కోరెం మీదుగా అనంతపల్లి గ్రామం దాకా బీటీ రహదారి అధ్వానంగా మారింది. ఈ గ్రామాల ప్రజలకు బోయినపల్లి మండల కేంద్రం, వేములవాడ, కరీంనగర్ పట్టణాలకు ఇదే ప్రధాన మార్గం కాగా, ఎన్నో ఏళ్ల క్రితం వేసిన రోడ్డు కావడం, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. రోడ్డు చెడిపోవడంతో వేములవాడ నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సు కూడా రద్దయింది. అయితే ఇక్కడి ప్రజల విజ్ఞప్తి మేరకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం 1.50కోట్లు మంజూరు చేసింది. దీంతో మూడు రోజుల కింద కోరెం నుంచి బూరుగుపల్లి దాకా బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి, పూర్తి చేశారు. ఆదివారం బూరుగుపల్లి నుంచి బోయినపల్లి దాకా రోడ్డు పనులు ప్రారంభించగా, ఆయా గ్రామాల ప్రజలు సంబురపడుతున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
కోరెం నుంచి బూరుగుపల్లి మీదుగా బోయినపల్లి దాకా బీటీ రోడ్డు వేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు ఈ రోడ్డు మీదుగా బోయినపల్లికి వెళ్లాలంటే నరకం కనిపించేది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం, బీటీ రోడ్డు పనులు చకచకా చేస్తుండడం సంతోషంగా ఉంది. రోడ్డు పూర్తయితే ఏ ఇబ్బంది లేకుండా బోయినపల్లికి వెళ్లవచ్చు.
-వేల్పుల బాబు, కోరెం (బోయినపల్లి మండలం)
గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి..
గ్రామీణ రహదారుల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వాల హయాంలో గ్రామీణ రహదారులు చాలా అధ్వానంగా ఉండేవి. కానీ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పల్లె రోడ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ప్రతి గ్రామానికి ఆర్టీసీ వెళ్తుంది. ప్రయాణం ఎంతో మెరుగుపడింది. తాజాగా బోయినపల్లి నుంచి బూర్గుపల్లి, కోరెం మీదుగా రోడ్డు వేస్తుండడం సంతోషంగా ఉంది.
– ముద్దం రవి, కొండగట్టు ఆలయ కమీటీ సభ్యుడు (బూర్గుపల్లి గ్రామం)