రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): పొద్దంతా వ్యవసాయ పనులు చేసి సాయంత్రం వేళల్లో సేద తీరాలంటే నాడు చెరువు కట్టలు, పొలం గట్లు మినహా మరేవీ పల్లెల్లో కనిపించేవి కాదు. కుటుంబంతో కలిసి పార్కులకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం పోవాల్సిందే. పల్లెల్లో చిన్నారులు ఆడుకోవాలన్నా ఆటవస్తువులు లేని దుస్థితి. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో హరిత హారం యజ్ఞం ఎనిమిది విడుతల్లో నిర్వహించారు. లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు.
మరోవైపు విలేజీ పార్కులు పల్లె ముంగిట్లోకి వచ్చేలా చేశారు. సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, 12 హాబిటేషన్లుండగా, 267 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఒక్కో ఊరిలో 20 గుంటల నుంచి రెండెకరాల స్థలంలో పార్కులను తీర్చిదిద్దారు. వాటితో పాటు 60 వరకు బృహత్పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. అందులో 4 వేల నుంచి 6వేల వరకు వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు. పెంచిన మొక్కల సంఖ్య 50,4,831 కాగా, అందులో 98.28శాతం మొక్కలను కాపాడారు. ఆ పార్కుల్లో ప్రజలు సేద తీరేలా మధ్యలో కూర్చుండేందుకు సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారు. చిన్నారులను ఆకట్టుకునేలా పలు పార్కుల్లో బొమ్మలను గీశారు. పండుగలు, సెలవు దినాల్లో పల్లెప్రజలంతా విలేజీ పార్కులో ఎంజాయ్ చేస్తున్నారు.
జీపీలకు నిర్వహణ బాధ్యతలు
పల్లె ప్రకృతి వనాలను రెండేళ్లపాటు ఉపాధి హామీ కూలీలతో నిర్వహించిన అధికారులు తర్వాత వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. పాలకవర్గం, సర్పంచులు, కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ వనాలను కాపాడుతున్నారు. పార్కులకు వచ్చే ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. భవిష్యత్తులో విలేజీ పార్కులను ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆకర్శిస్తున్న మినీ ట్యాంక్బండ్లు
సమైక్య పాలనలో పూడిక నిండి చెరువులన్నీ వట్టి పోయాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల్లో పూడిక తీయడం, సమృద్ధిగా వర్షాలు కురువడంతో చెరువులకు జలకళ సంతరించుకుంది. అలాంటి చెరువులను మినీ ట్యాంకు బండ్లుగా లభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రజలు సాయంత్రం వేళల్లో సేద తీరేందుకు చెరువులను మినీ ట్యాంకు బండులుగా అభివృద్ధి చేస్తున్నది. అందులో భాగంగా పలుచోట్ల మినీ ట్యాంకు బండ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ట్యాంకు బండ్లలో అందమైన మొక్కలు, పిల్లలను ఆకట్టుకునేలా వివిధ రకాల ఆటవస్తువులు, నందన వనాలను ఏర్పాటు చేస్తున్నది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్తచెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతున్నది. చెరువులో కేబుల్ బ్రిడ్జి, హోటల్, బోటు షికారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా పార్కులు, మినీ ట్యాంక్బండ్లు పట్టణ, మండలాలకే పరిమితం చేయకుండా, గ్రామీణ ప్రాంత ప్రజలు అహ్లాదకర వాతావరణంలో సేద తీరేలా పల్లెల్లో సైతం పార్కుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.