జాతీయ అవార్డుల కోసం మరోసారి సత్తా చాటేలా జిల్లాలోని పంచాయతీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డుల్లో ప్రతి ఏటా రాష్ట్రం, జిల్లా అత్యధికంగా అవార్డులు సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కేంద్ర ప్రభుత్వం 9 థిమటిక్స్ (విభాగాలు)లో 27 అంశాలపై అవార్డులు ఇవ్వనుండగా, ఇందుకు దేశంలోని అన్ని పంచాయతీలు పోటీ పడే అవకాశాన్ని కల్పించింది. అయితే, జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజా పరిషత్ స్థాయిలో ఒక్కోదానికి 27 చొప్పున 81, ప్రత్యేక కేటగిరీలో మరో 9 కలిపి మొత్తం 90 అవార్డులు ప్రదానం చేయనున్నది. కాగా, అవార్డుల కోసం పోటీ పడేందుకు జిల్లా అధికారులు పంచాయతీలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 30 వరకు కేంద్రం ఇచ్చిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, మండల, జిల్లా స్థాయిలోని కమిటీలు వీటిని పరిశీలించి జాతీయ స్థాయి పోటీలకు పంపించనున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రగతి ఆధారంగా అవార్డులు ఇస్తున్న కేంద్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జరిగే పంచాయతీరాజ్ దివస్ ఉత్సవాల్లో ప్రదానం చేయనున్నది.
కరీంనగర్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీ కరణ్ (డీడీయూపీఎస్పీ) కింద ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్లకు అవార్డులు, నగదు పురస్కారాలు అందిస్తున్నది. అయితే, ఈసారి దీన్దయాల్ ఉపాధ్యాయ సతత్ వికాస్ పురస్కార్ (డీడీయూఎస్వీపీ)గా పునరుద్దరించి అవార్డులు ఇస్తోంది. గతంలో పంచాయతీలకు రూ.10 లక్షలు, మండల పరిషత్లకు రూ.25 లక్షలు, జిల్లా పరిషత్లకు రూ.50 లక్షలు నగదు పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించేది. పునరుద్దరించబడిన పురస్కారం కింద ఇప్పుడు జడ్పీలకు రూ.1.50 కోట్లు, మండల పరిషత్లకు రూ.కోటి, గ్రామ పంచాయతీలకు రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించింది. అంతే కాకుండా థిమటిక్స్ను కూడా పెంచింది. గత పురస్కారంతో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏ పనులు పూర్తి కావడం లేదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా ప్రపంచ స్థాయిలో 189 దేశాలు 2030 ఆర్థిక సంవత్సరం వరకు 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో మన దేశం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో గ్లోబల్ కాన్సెప్ట్తో ఇప్పుడు అవార్డులు ఇస్తున్నారు. ఇందులో జాతీయ స్థాయిలో 27 అవార్డులు గ్రామ పంచాయతీలకు, 27 అవార్డులు మండల ప్రజా పరిషత్తులకు, మరో 27 అవార్డులు జిల్లా ప్రజా పరిషత్తులకు కలిపి మొత్తం 81 అవార్డులు ఇస్తున్నారు. ఇందులో ఓవరాల్గా అవార్డులు సాధించిన వారికి నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తం పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద 9 ప్రత్యేక అవార్డులు ఇస్తున్నారు. జాతీయ స్థాయిలో ఇచ్చే మొత్తం 90 అవార్డుల కోసం ప్రతి గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజాపరిషత్తులు పోటీ పడే అవకాశాన్ని ఇచ్చారు. అయితే, పోటీ ప్రస్థానం గ్రామ పంచాయతీల నుంచే మొదలవుతుంది.
మూడు స్థాయిల్లో అవార్డులు
జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లకు మూడు స్థాయిల్లో అవార్డు ప్రదానం చేస్తారు. అయితే, గ్రామాలు సాధించిన అభివృద్ధిని పరిగణలోకి తీసుకుని మండల, జిల్లా పరిషత్లను ఎంపిక చేస్తారు. ప్రతి పురస్కారానికి 9 (థిమటిక్స్) విభాగాల్లో 27 అంశాలు ఉంటాయి. ప్రతి అంశానికి ఒక నిర్ధిష్టమైన ప్రశ్నావళిని రూపొందించి వెబ్సైట్లో ఉంచారు. వీటికి అనుగుణంగా ఫొటోలు, వీడియోలను ఆధారంగా చూపుతూ గ్రామ పంచాయతీ, ఇతర రికార్డుల ఆధారంగా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన నివేదికలను ఎంపీడీవో చైర్మన్గా, ఎంపీవో కన్వీనర్గా, 29 లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు గల సభ్యుల కమిటీ పరిశీలించి జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చైర్మన్గా డీపీవో/జడ్పీ సీఈవో కన్వీనర్గా 29 లైన్ డిపార్ట్మెంట్ల అధికారులు సభ్యులుగా ఉన్న కమిటీకి సిఫారసు చేస్తారు. వీటిని పరిశీలించిన జిల్లా స్థాయి కమిటీ రాష్ర్టానికి సిఫారసు చేస్తుంది. అక్కడి నుంచి పంపిన దరఖాస్తులను ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ను పరిశీలించి ఉత్తమంగా ఉన్న వాటిని అవార్డులకు ఎంపిక చేస్తుంది. అయితే, ఈ అవార్డుల కోసం గ్రామ పంచాయతీలు మాత్రమే అప్లోడ్ చేసుకున్నట్లయితే ఆటోమెటిక్గా మండల ప్రజా పరిషత్లకు రేటింగ్ వస్తుంది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలోని 313 గ్రామ పంచాయతీలు అవార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేసుకున్నట్లయితే జిల్లాలోని 15 మండలాలకు వాటి పరిధిలోని గ్రామాల్లో జరిగిన ఉత్తమ అభివృద్ధి లక్ష్యాలను బట్టి రేటింగ్ వస్తుంది. పంచాయతీలు అప్లోడ్ చేయని అంశాలేవైనా మిగిలిపోయి ఉండి, మండల పరిధిలో ఏవైనా ప్రత్యేక పనులు చేసి ఉంటే వాటి ఆధారంగా మండల పరిషత్లు జిల్లా కమిటీకి నివేదించే అవకాశం ఉంటుంది. మండలాలు అప్లోడ్ చేసే వివరాలను బట్టి జిల్లా పరిషత్లకు, అన్ని జిల్లా పరిషత్లను బట్టి రాష్ర్టానికి రేటింగ్ వస్తుంది.
30వ తేదీ వరకు అవకాశం
అవార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 10 నుంచి ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. తర్వాత వెబ్సైట్ను ఫ్రీజ్ చేస్తారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, సేవల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటి ఆధారంగా 2023-24 సంవత్సరానికి ఈ అవార్డులను వచ్చే ఏడాది ఏప్రిల్ 24న ఢిల్లీలో జరిగే జాతీయ పంచాయతీ రాజ్ దివస్ రోజు ప్రదానం చేస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అన్ని గ్రామ పంచాయతీలకు, మండల ప్రజా పరిషత్లకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తులు సైతం అప్లోడ్ అయినట్లు తెలుస్తోంది. ఈసారి అవార్డుతో పాటు నగదు పురస్కారం పెద్ద మొత్తంలో ఉండడం, అన్ని గ్రామాలు పోటీలో పాల్గొనే అవకాశం ఉండటంతో దాదాపు అన్ని పంచాయతీల నుంచి దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాకు అవార్డుల పంట
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది. ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఈ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 22 అవార్డులు వచ్చాయి. గతేడాది ఇచ్చిన అవార్డుల్లో కోరుట్ల, ధర్మారం మండల పరిషత్లకు, కరీంనగర్ జిల్లా పర్లపల్లికి, సిరిసిల్ల జిల్లా హరిదాస్నగర్, మోహినికుంట అవార్డులు వచ్చాయి.పెద్దపల్లి జిల్లా సుందిల్లకు రెండు కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. గతంలో కంటే పారిశుధ్యం, తాగు నీటి వసతులు, కాలుష్య రహితంగా అనేక గ్రామాలు ఇప్పటికే తీర్చిదిద్దబడ్డాయి. ఈ నేపథ్యంలో అనేక గ్రామాలు జాతీయస్థాయి పోటీలో నిలిచే అవకాశాలు ఉంటాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెండు కేటగిరీల్లో అవార్డులు
కేటగిరీ-1లో దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ సతత్ వికాస్ పురస్కార్ కింద గ్రామ పంచాయతీలకు 27, మండల పరిషత్లకు 27, జిల్లా పరిషత్లకు మరో 27 చొప్పున జాతీయ స్థాయిలో మొత్తం 81 అవార్డులు ఇస్తారు. కేటగిరీ-2లో నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తం పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద 9 అవార్డులు ఇస్తారు. అంటే జాతీయ స్థాయిలో ఈ పురస్కాల కింద 90 అవార్డులు ప్రదానం చేయనున్నారు. అయితే, మొదటి కేటగిరీలో ఎంపికైన మొదటి మూడు గ్రామ పంచాయతీలకు, మొదటి మూడు మండల పరిషత్లకు, అలాగే మొదటి మూడు జిల్లా పరిషత్లకు ఈ స్పెషల్ అవార్డులు ప్రదానం చేస్తారు. అంతే కాకుండా, మండలంలో అన్ని పంచాయతీలు దరఖాస్తులు అప్లోడ్ చేసి ఒక రకంగా పోటీ పడి ఉంటే, జిల్లాలో అన్ని మండలాలు దరఖాస్తులు అప్లోడ్ చేసి ఉంటే కూడా స్పెషల్ అవార్డుల కింద ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
9 విభాగాలు 113 ప్రశ్నలు
అవార్డుల కోసం పోటీ పడే పంచాయతీలు 9 విభాగాల్లో కలిపి 113 ప్రశ్నలకు ఆధారాలతో కూడిన జవాబులు ఇవ్వాలి. ఒక గ్రామంలో అందుతున్న ఉత్తమ అభివృద్ధి, సేవలను ఆధారం చేసుకుని అవార్డుకు ఎంపిక చేస్తారు. ఒక మండలంలో ఎన్ని గ్రామాల్లో ఉత్తమ అభివృద్ధి, సేవలు అందుతున్నాయో పరిశీలించి మండల ప్రజా పరిషత్లను, అలాగే జిల్లాలో ఎన్ని మండలాల్లో ఉత్తమ అభివృద్ధి, సేవలు అందుతున్నాయో పరిశీలించి జడ్పీలను ఎంపిక చేస్తారు.
పేదరికం లేని మెరుగైన జీవనోపాధి పంచాయతీ విభాగంలో 14
ఆరోగ్య కరమైన పంచాయతీ విభాగంలో 14
చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో 13
సరిపడా నీరు ఉన్న పంచాయతీ విభాగంలో 13
క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభాగంలో 10
పంచాయతీలో స్వీయ- సమృద్ధమైన మౌలిక సదుపాయాల విభాగంలో 16
సామాజిక భద్రత కలిగిన పంచాయతీ విభాగంలో 8
గుడ్ గవర్నెన్స్ పంచాయతీ విభాగంలో 14
మహిళా స్నేహ పూర్వక పంచాయతీ విభాగంలో 11