కార్పొరేషన్, మే 29: నగరంలోని పద్మనగర్లో ఈ నెల 31న ఉదయం చేపడుతున్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ భూమిపూజ, సాయంత్రం నిర్వహించే శ్రీనివాస కల్యాణానికి నగర ప్రజలందరూ తరలిరావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ టవర్సర్కిల్ ఏరియాలోని ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్లో అత్యంత అద్భుతంగా వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మిస్తున్నారని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం పదెకరాల స్థలాన్ని కేటాయించిందన్నారు. ఈ నెల 31న ఉదయం భూమిపూజ, సాయంత్రం 6 గంటలకు తిరుపతి, తిరుమల అర్చకుల ఆధ్వర్యంలో అక్కడ జరిగే విధానంలోనే శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తామని చెప్పారు.
ఈ దైవకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఏడాదిన్నరలోగా పద్మనగర్లో అద్భుతమైన శ్రీవారి ఆలయం నిర్మాణం పూర్తవుతుందన్నారు. తిరుపతి తరహాలో ఈ ఆలయంలోనూ పూజలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి-హరిశంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు వంగల శ్రీదేవి, గుగ్గిళ్ల జయశ్రీ, కోల మాలతి, నాంపల్లి శ్రీనివాస్, గందె మాధవి, నాయకులు అనురాసు కుమార్, ప్రేమ్కుమార్ ముందడా, ఒంటెల సత్యనారాయణరెడ్డి, చిట్టిమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.