రెండో రోజూ కొనసాగిన వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
హాజరైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, భక్తులు
కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 5: నగరంలోని మారెట్ రోడ్డులో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పంచమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి, ప్రధాన నిర్వాహకుడు గంగుల కమలాకర్ నేతృత్వంలో శనివారం అధ్యయనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెండో రోజు శనివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉభయవేదాంత పండితులు ఉత్సవమూర్తుల ముందు ద్రవిడ ప్రబంధ పారాయణం చేశారు. ఉదయం, సాయంత్రం అధ్యయనోత్సవంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ద్రవిడ వేద పారాయణం, భజనలు, కీర్తనలు, గోవిందనామస్మరణతో ఆలయం మార్మోగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు కుటుంబ సభ్యులు, అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజాచార్యులు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో పీచర కిషన్రావు, ఉత్సవ కమిటీ బాధ్యులు గంప రమేశ్, గోగుల ప్రసాద్, టీ రవీందర్, దేవత, రవికుమార్, సంతోష్కుమార్, తిరుపతి, వనిత, లత, రాహుల్నారాయణ, ఉపేంద్రనాథ్, శ్రీనివాస్, శ్రీనివాసావరప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, భూపతి, విద్యాసాగర్, రామన్న, సుభాశ్, ప్రశాంత్ కుమార్, కార్పొరేటర్లు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
తెలంగాణ రాష్ట్ర ఈవెంట్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, ఆరెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గోగుల ప్రసాద్ నేతృత్వంలో ఉదయం శ్రీహనుమాన్ సేవాసమితి, ఎండపెల్లి శ్రీవేంకటేశ్వర, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి భజన మండళ్లు, మార్వాడి భక్తసమాజ్ ఆధ్వర్యంలో భజనలు, సాయంత్రం స్వప్న బృందం శాస్త్రీయ నృత్యాలు, గొల్లపల్లి రవీందర్ బృందం అన్నమాచార్య కీర్తనలు, లక్ష్మణాచారి బృందం భక్తిసంగీత విభావరి, వంగల సురేంద్రాచారి బృందం భరతనాట్యం, లలితా ప్రసాద్ బృందం, దారం గీతల అన్నమాచార్య కీర్తనలు, సుకృతీమేఘమాల, హంసిని, తేజస్విని, ధన్యశ్రీ, అనుపమ, కట్ట వాణి, శరణ్యల భక్తి కీర్తనలు అలరించాయి. అలాగే, రాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశమయ్యారు. భక్తుల తాకిడికి అనుగుణంగా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.