కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 2 : మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరస్వామి షష్ఠమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా, గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. జిల్లా కేంద్రంలోని మార్క్ఫెడ్ మైదానం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర దారిపొడవునా గోవింద నామ స్మరణతో మార్మోగింది. ప్రత్యేక రథంపై స్వామివారు నగరవాసులకు సర్వాలంకార భూషితుడై భూ సమేత వేంకటేశ్వరుడిగా కనువిందు చేశారు.
ఈ క్రమంలో శ్రీవారి వాహనాలైన శేష, చంద్ర, సూర్య, కల్పూరుక్ష, గజ, గరుడ, సింహ, అశ్వ, హనుమద్వాహనం, గుర్రాలు, గజరాజు దళాలు వెంటరాగా సన్నడోలు పంచ వాయిద్యాలు, భజనలు, కోలాటాలు, సంప్రదాయ నృత్యం, కళాకారుల కళాప్రదర్శనలు, కేరళ వారి సింగారి మేళం, కేరళ దశావతారాలు, హరిదాసులు, కళారూపాల మధ్య వైకుంఠపతి శోభాయాత్ర అంగరంగ వైభవంగా తీశారు. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన శోభయాత్రను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.