ఒక లక్ష్యం, సాధించాలనే తపన, నిత్య ఆచరణ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. మన ప్రయత్నం ఫలించి ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుంది. అందుకు వేములవాడ మండలం కోనాయిపల్లికి చెందిన గడ్డమీది గంగరాజు జీవితమే నిదర్శనంగా నిలుస్తున్నది. నాడు దినసరి కూలీగా.. రైస్మిల్లులో గుమాస్తాగా.. ఎడారి దేశంలో కార్మికుడిగా పనిచేసి తిరిగి స్వదేశానికి తిరిగివచ్చిన ఆయనకు ఓ రోజు తట్టిన ఆలోచన తన జీవితాన్నే మార్చివేసింది. 40లక్షల పెట్టుబడితో వేములవాడలో ప్రారంభించిన మొలల వ్యాపారం నాలుగేండ్లలోనే విస్తరించి రాష్ట్రంలోనే ఫేమస్ ఇండస్ట్రీయలిస్టుగా నిలబెట్టింది. ప్రస్తుతం నెలకు 40లక్షల టర్నోవర్ సాధిస్తున్న గంగరాజు, తాను వృద్ధిలోకి రావడమే కాదు తన పరిశ్రమలో మరో 20 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
– వేములవాడ, జూలై 3
కోనాయిపల్లికి చెందిన గడ్డమీది గంగరాజు కష్టపడుతూ పైకి వచ్చాడు. దుబాయ్లోని మొలల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడే తాను కూడా ఇండియాలో ఇలాంటి పరిశ్రమ పెట్టాలని అనుకున్నాడు. అక్కడ కష్టపడి పనిచేసి మేనేజర్ స్థాయికి ఎదిగాడు. తర్వాత అలా ఐదేళ్లపాటు చేసిన వృత్తిలో అనుభవం సంపాదించుకొని తిరిగి స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ మొలల ఫ్యాక్టరీలో పనిచేసిన అనుభవం ఉండడంతో వేములవాడలో అద్దె ప్రతిపాదికన ఒక షెడ్డు తీసుకొని శ్రీ సాయి ఇండస్ట్రీస్ పేరుతో మొలల వ్యాపారాన్ని ప్రారంభించారు.
అన్ని ప్రాంతాలకు సప్లయ్ చేస్తున్న
నేను బ్యాంకు రుణంతో నాలుగేళ్ల క్రితం 40లక్షలతో వ్యాపారాన్ని ప్రారంభించిన. కష్టానికి ఫలితం దకినట్లుగా నెలకు 40లక్షల వ్యాపారం చేస్తున్నా. ఇటీవలే మలేషియా టెక్నాలజీకి చెందిన అధునాతన మొలల యంత్రాన్ని 30లక్షలు వెచ్చించి కొన్న. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే మొలలు విదేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చు. ప్రస్తుతం 12 గుంటల స్థలంలో సొంతంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసుకొని ఉపాధి కల్పిస్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్న. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సప్లయ్ చేస్తున్న.
-గడ్డమీది గంగరాజు, శ్రీ సాయి ఇండస్ట్రీస్ యజమాని
రాష్ట్రంలోనే టాప్ త్రీ కంపెనీగా..
గంగరాజు బ్యాంకు రుణంతో 40లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారంలోకి దిగాడు. మొలల తయారీకి అవసరమైన మూడు మిషన్లు కొనుగోలు చేశాడు. మంచి లాభాలు రావడంతో క్రమంగా వ్యాపారాన్ని విస్తరించాడు. ప్రస్తుతం 20మిషన్లతో రోజుకు నాలుగు టన్నుల మొలలు తయారు చేస్తూ నెలకు 40లక్షల వ్యాపారం చేస్తున్నాడు. వీటితోపాటు వ్యవసాయ భూములకు వేసే ఫెన్సింగ్ వైర్లు కూడా తయారు చేస్తున్నాడు. రాష్ట్రంలోనే టాప్ త్రీ కంపెనీగా ఎదిగి వ్యాపారాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాడు. తాను వృద్ధిలోకి రావడమే కాదు తన పరిశ్రమలో 20మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అందులో ఇద్దరు డ్రైవర్లు మినహా మిగతా వారందరూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. కాగా, గంగరాజు మొలల తయారీకి అవసరమయ్యే ముడి సరుకును ఛత్తీస్గఢ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. నాణ్యమైన వస్తువుల తయారీకి అక్కడి సరుకే బాగుంటుందని చెబుతున్నాడు.
విదేశాలకు ఎగుమతి దిశగా అడుగులు
మరింత నాణ్యమైన, వేగంగా మొలలు తయారు చేయడం, ఇంకా విదేశాలకు సైతం ఎగుమతి చేసేందుకు అడ్వాన్స్ మెషీన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నాడు. అందులో భాగంగా మలేషియా టెక్నాలజీతో కూడిన యంత్రాన్ని ఇటీవలే గుజరాత్కు వెళ్లి కొనుగోలు చేయగా, వారం రోజుల్లో ఇక్కడికి చేరుతుందని గంగరాజు చెబుతున్నాడు. ఈ యంత్రం వస్తే మొలల తయారీ మరింత వేగంగా జరుగుతుందని, ఇంకా విదేశాలకు సైతం ఎగుమతి చేయవచ్చని అంటున్నాడు.