అరుదైన చికిత్స విధానాలకు కేరాఫ్గా నిలుస్తున్న వేములవాడ దవాఖాన మరో అధునాతన వైద్యమందించేందుకు సిద్ధమైంది. సర్కారు మూత్రపిండ రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు త్వరలోనే డయాలసిస్ సెంటర్ను అందుబాటులోకి తేనున్నది. ఇప్పటికే కోటి వెచ్చించి అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేయడమే గాకుండా, అవసరం మేరకు వైద్యసిబ్బందిని నియమించింది. ఈ ప్రాంతంలోని 55 మంది కిడ్నీ పేషెంట్లకు ఈ సెంటర్ భరోసా ఇవ్వనున్నది. బాధితులకు దూర, ఆర్థిక భారం తప్పనుండగా, ఆయావర్గాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
వేములవాడ, జూన్ 23 : వేములవాడ దవాఖాన అరుదైన వైద్య సేవలకు కేరాఫ్గా నిలుస్తున్నది. మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చొరవ, ఎమ్మెల్యే రమేశ్బాబు కృషితో సకల సౌకర్యాలతో గ్రామీణ పేదలకు మెరుగైన వైద్యమందిస్తున్నది. రాష్ట్రంలోని అతిపెద్ద దవాఖానల్లో మాత్రమే చేసే మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేస్తున్నారు. దంత, కంటి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. గర్భిణులకు సైతం కార్పొరేట్ తరహాలో వైద్యమందిస్తుండడంతో అనేక మంది ఇక్కడ ప్రసవం చేయించుకునేందుకు ముందుకువస్తున్నారు.
వేములవాడ ఏరియా దవాఖానలో డీసీడీసీ కిడ్నీ కేర్ అనే సంస్థ ద్వారా దాదాపు రూ. కోటితో ఏరియా డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అందులో అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన ఐదు బెడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. డయాలసిస్ సెంటర్ కోసం కలెక్టర్ అనురాగ్ జయంతి 10 లక్షలు కేటాయించగా వార్డు పునర్నిర్మాణం, షెడ్డు, ప్రత్యేకంగా శుద్ధ జల నీటి కేంద్రం లాంటివి ఏర్పాటు కూడా చేశారు. ఇందులో కనీసం రోజు 20మంది కిడ్నీ బాధితులకు వైద్య సేవలు 24 గంటల పాటు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఒక రోగికి ఒకేసారి వినియోగించే విధంగా అవసరమైనటు మెడికల్ సామగ్రిని కూడా సమకూర్చారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు వారానికి మూడు లేదా నాలుగు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుండగా, అందుకు వారానికి దాదాపు పది వేల నుంచి 12వేల ఖర్చవుతుంది. అయితే ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా సేవలు ఉచితంగా అందనున్నాయి. ఈ ప్రాంతంలోని 50 మంది కిడ్నీ సంబంధిత బాధితులకు సేవలు మరింత చేరువ కానున్నాయి.
డయాలసిస్ సెంటర్ ఆధునిక వసతి సౌకర్యాలతో ఐదు మంచాలతో పూర్తవుతుంది. దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయి. వేములవాడ ఏరియా దవాఖాన పరిధిలో దాదాపు 50 మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వీరికి ఈ వైద్య సేవలు మరింత చేరువకానున్నాయి. పూర్తి ఉచితంగా, అధునాతన పద్ధతుల్లో చికిత్స అందిస్తాం. కిడ్నీ రోగులు వినియోగించుకోవాలి.
-డాక్టర్ రేగులపాటి మహేశ్ రావు, సూపరిండెంట్ (వేములవాడ)