ముస్తాబాద్, నవంబర్ 30: పని ముగించుకొని వస్తున్న ఇద్దరు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలిగొన్నది. డీసీఎం వ్యాన్, ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో వీరు దుర్మరణం చెందారు. బుధవారం రాత్రి రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో ఈ దుర్ఘటన జరిగింది. చెట్టంత కొడుకుల మరణంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ముస్తాబాద్ ఎస్ఐ
వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..ముస్తాబాద్కు చెందిన ఒల్లెపు పద్మ కనుకయ్య, పద్మ దంపతుల కుమారుడు శ్రీనివాస్ ఒల్లెపు శ్రీనివాస్(21) అలియాస్ బన్నీ, బాపయ్య, ఎల్లవ్వ దంపతుల కొడుకు సూర నవీన్ (22), బుధవారం ఉదయం గంభీరావుపేట మండలం లింగన్నపేటలో హార్వెస్టర్ నడిపేందుకు బైక్పై వెళ్లారు. పని ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగివస్తుండగా చిప్పలపల్లి వద్ద వీరి ద్విచక్రవాహనాన్ని ముస్తాబాద్ నుంచి చిప్పలపల్లి వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించారు. వీరి మరణవార్త తెలుసుకున్న యువకుల తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. చేతికొచ్చిన కొడుకులు ఇక తిరిగిరారని తెలిసి హృదయవిదారకంగా విలపించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం కోసం సిరిసిల్ల దవాఖానకు తరలించారు. యువకుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.