కోరుట్ల, ఏప్రిల్ 27: కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లు తమ నిజాయితీని చాటుకున్నారు. ప్రయాణికుడు బస్సులో మరిచిపోయిన బ్యాగును భద్రపరిచి తిరిగి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఆంధ్రప్రదేశ్లోని వింజమూరు నుంచి కోరుట్లకు వస్తున్నది. అయితే హైదరాబాద్లోని జూబ్లీ బస్టాండులో ఎక్కిన ఓ ప్రయాణికుడు జగిత్యాలకు టికెట్ తీసుకున్నాడు. జగిత్యాల దిగే క్రమంలో తన బ్యాగును బస్సులోనే మరిచిపోయాడు. కోరుట్లలో ప్రయాణికులను దించి వేసిన తర్వాత డ్రైవర్లు తిరుపతి, లక్ష్మణ్ బస్సును తనిఖీ చేశారు. ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగు కనిపించడంతో డిపో ట్రాఫిక్ సూపరింటెండెంట్కు అందజేశారు.
బ్యాగులో ఉన్న చిరునామా ఆధారంగా నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన స్వీపతి సత్తన్నగా అధికారులు గుర్తించారు. డిపో మేనేజర్ లక్ష్మీప్రసూన ప్రయాణికుడికి ఫోన్ చేసి బ్యాగు దొరికిన విషయాన్ని తెలియజేశారు. గురువారం కోరుట్లకు వచ్చిన సత్తన్నకు ఆయన దగ్గర ఉన్న ఆధారాలను పరిశీలించి బ్యాగును అప్పజెప్పారు. కాగా, బ్యాగులో పాస్పోర్టు, రెండు సెల్ఫోన్లు, 10 తులాల బంగారం ఉంది. కాగా, నిజాయితీగా తనకు బ్యాగును అప్పగించిన బస్సు డ్రైవర్లకు, ఆర్టీసీ అధికారులకు సత్తన్న కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ట్రాఫిక్ సూపరింటెండెంట్ వెంకటేశం, సీఆర్సీ రాంమోహన్, కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేశ్, సెక్యూరిటీ అధికారి శ్రావణి ఉన్నారు.