రాజకీయ జన్మనిచ్చిన టీఆర్ఎస్ పార్టీపై విమర్శలా..?
బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్
మానకొండూర్, మార్చి 29: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బ్రోకర్ రాజకీయాలు చేయడం మానుకోవాలని సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయకపోతే టీఆర్ఎస్ను బొందపెడుతామని పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ జెండా, కండువాతోనే రాజకీయాల్లోకి వచ్చి మంత్రి పదవి చేపట్టిన సంగతి మరిచి పోయావా? అని ప్రశ్నించారు.? రాజకీయ జన్మనిచ్చిన పార్టీపైనే విమర్శలు చేసే నీచపు సంస్కృతి నీదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పాల్గొన్న ఇన్చార్జుల భరతం పడుతానని హెచ్చరిస్తున్నవు, ఎన్నికలంటే అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఇన్చార్జులుగా వ్యవహరిస్తారనే కనీస జ్ఞానం కూడా నీకు తెలియదా అని విమర్శించారు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడే కాంగ్రెస్, బీజేపీ నాయకులతో చీకటి ఒప్పందాలు చేసుకున్న నీచపు చరిత్ర నీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమని కొర్రీలు పెడుతుంటే బ్రోకర్ రాజకీయాలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేస్తావా? అని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పార్టీ శ్రేణులు నిన్ను తరిమి కొడుతారని హెచ్చరించారు. జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్గౌడ్, ఆర్బీఎస్ మండల కో-ఆర్డినేటర్ రామంచ గోపాల్రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ గుర్రం కిరణ్గౌడ్, నాయకులు పిట్టల మధు, శాతరాజు యాదగిరి, ఎరుకల శ్రీనివాస్గౌడ్, నెల్లి మురళి, ఉండింటి శ్యాంసన్, దండు రాములు, ఇస్కుల్ల ఆంజనేయులు, అనిల్, శేఖర్, మొగిళి, శంకర్, కిరణ్, వెంకటస్వామి పాల్గొన్నారు.