ఓదెల, జూన్ 17: ‘సమైక్య రాష్ట్రంలో తండాలు ఎట్లుండేది. తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో ఎట్లున్నయ్’ ఆలోచించాలని గిరిజనులకు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాగునీరందక.. రోడ్డు సౌకర్యం లేక, వైద్యం అందుబాటులో లేక గోసెళ్లదీసిన గిరిపుత్రుల బతుకుల్లో తెలంగాణ సర్కారు వెలుగులు నింపిందని చెప్పారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఓదెల మండలం లంబాడీతండాలో శనివారం గిరిజన మహోత్సవం నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా మామిడి తోరణాలు కట్టారు. ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో అలంకరించారు. మహిళలు, వృద్ధులు సాంప్రదాయ దుస్తుల్లో గిరి నృత్యాలతో హోరెత్తించారు. ఫ్లెక్సీల ద్వారా గ్రామ ప్రగతిని వివరించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి, కలెక్టర్ సంగీతా సత్యానారాయణతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరిజన గ్రామాల అభివృద్ధికి విరివిగా నిధులిచ్చారని చెప్పారు. తండాలను పంచాయతీలుగా మార్చి ప్రగతికి బాటలు వేశారని పేర్కొన్నారు.
గిరిజన పంచాయతీల్లో తారురోడ్లు, వైకుంఠధామం, డంప్యార్డ్, పల్లె ప్రకృతి వనం, వానర వనం, క్రీడా ప్రాంగణం, వన నర్సరీ, ట్రాక్టర్, ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, స్వచ్ఛమైన భగీరథ నీరందిస్తున్నామని చెప్పారు. చేసిన పనులను చూసి బీఆర్ఎస్ సర్కారును ఆదరించాలని కోరారు. కాగా గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువతో రోడ్డు ఇరుగ్గామారిందని ఉపసర్పంచ్ నిమ్మానాయక్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యేతో కలిసి అక్కడికి వెళ్లి రోడ్డు పరిస్థితిని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఛెప్పారు. తండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక విద్యార్థిని శ్రావణి కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, పెద్దపల్లి ఏఎంసీ వైస్చైర్మన్ ఐరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచ్ గుగులోతు లక్ష్మి, ఉపసర్పంచ్ గుగులోతు నిమ్మానాయక్, వస్త్రంనాయక్, దేవిలాల్, పర్శనాయక్, డీపీవో చంద్రమౌళి, డీఆర్డీఓ శ్రీధర్, ప్యాక్స్ చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ ఫోరం మండలాధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, బోడకుంట చినస్వామి, కనికిరెడ్డి సతీష్, మ్యాడగోని శ్రీకాంత్, బుద్దె కుమార్, తహసీల్దార్ రమేశ్, ఎంపీవో అబ్దుల్ వాజిద్, పీఆర్ఏఈ జిన్నా సమ్మిరెడ్డి, ఏపీఎం లతామంగేశ్వరి. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం
పెద్దపల్లి జిల్లాలో 14 వేల మంది గిరిజనులు ఉన్నారు. ప్రభుత్వం 300 జనాభా దాటిన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వపరిపాలనకు అవకాశం కల్పించింది. తండా జీపీలకు పక్క భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. వారి పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. గిరిజనులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలి. గిరిపుత్రుల ఆరా ధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మ, సేవాలాల్ ఉత్సవాలను ప్రభుత్వం అధికారికం గా నిర్వహిస్తున్నది. పోడు భూముల సమ స్య పరిష్కారానికి చర్యలు చేపట్టింది. 100 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది.
– సర్వే సంగీతా సత్యనారాయణ,పెద్దపల్లి కలెక్టర్