పెద్దపల్లి జిల్లాలో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. గడువు ముగిసినా ఈ వ్యవహారం మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా రైతుల పొలాల్లో ఇసుక మేటల పేరుతో దందా జోరుగా నడుస్తోంది. నిజానికి గత డిసెంబర్ నాటికే పొలాల్లోని ఇసుక దిబ్బలు తీసి విక్రయించడానికి మాత్రమే అవకాశం ఉన్నా.. నేటికీ కొనసాగుతూనే ఉన్నది. సమ్మక్క జాతర సందర్భంగా గడిచిన మూడు రోజులు ఈ దందాను తాత్కాలికంగా ఆపేసినా.. మళ్లీ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పొలాల్లోని దిబ్బల ఇసుకను తరలించడమే ప్రస్తుత నిబంధనలకు విరుద్ధం కాగా, దీని మాటున మానేరు ఇసుకను కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారానికి అడ్డుకట్టవేయాల్సిన అధికారయంత్రాగం.. చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం అక్రమార్కులకు కలసి వస్తుండగా.. కొందరు అధికార పార్టీ నాయకులు ఇందులో కీలక పాత్రదారులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
కరీంనగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెద్దపల్లి జిల్లా ఇసుక అక్రమాలకు నిలయంగా మారింది. దోచుకున్న వారికి దోచుకున్నంత అన్న చందంగా సాగుతోంది. అధికారికంగా తవ్వకానికి గడువు ముగిసినా.. నిత్యం పెద్ద మొత్తంలో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఈ జిల్లాలో టీఎస్ఎండీసీ, భూగర్భగనుల శాఖల ఆధ్వర్యంలో పలు చోట్ల ఇసుక క్వారీలు నడుస్తుండగా, టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో పొత్కపల్లి-2, గుండ్లపల్లి-2, ముత్తారం, అడవిసోమన్పల్లి, ఓడేడ్, శ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, జిల్లెల్లపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి.
నిజానికి ఈ క్వారీల నుంచి ఇసుకను ఎత్తేందుకు అనుమతి 2023 డిసెంబర్ 31తో ముగిసింది. ఈ క్వారీల నుంచి అధికారులు చెపుతున్న లెక్క ప్రకారం కోటి 32 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక తీయడానికి ఆస్కారం ఉండగా.. ఇప్పటి వరకు 70,72,840.84 క్యూబిక్ మీటర్లు తీసినట్లు చెబుతున్నారు. అయితే, సదరు క్వారీల నుంచి తీసిన ఇసుకను స్టాక్ పాయింట్లలో పెట్టి.. ప్రస్తుతం అధికారికంగా రవాణా చేస్తున్నట్లుగా ఈ క్వారీల నిర్వాహకులు చెబుతున్నారు. దీనిని లోతుగా చూస్తే.. ఇక్కడ జరుగుతున్న తంతు మరో రకంగా ఉంది. అయితే, ఇదిలా ఉండగా.. రైతుల పొలాల్లో ఇసుక మేటల మాటున కొందరు అక్రమాలకు తెరలేపారు.
గతంలో మానేరు పొంగినప్పుడు.. ముత్తారం మండలం ఓడెడ్ గ్రామ పరిధిలోని రైతుల పొలాల్లో ఇసుక దిబ్బలు ఏర్పడ్డాయి. వీటిని తొలగించుకునేందుకు సదరు రైతులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ మేరకు ఐదు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. రెవెన్యూ, నీటిపారుదల, భూగర్భజలశాఖ, టీఎస్ఎండీసీ, భూగర్భగనుల శాఖాధికారులు పరిశీలించి.. సదరు రైతు పొలాల్లో ఎంత మేరకు ఇసుక దిబ్బలున్నాయి. అందులో వెళ్లే ఇసుక ఎంత..? గుర్తించి అనుమతి ఇస్తారు. ఆ మేరకు సదరు రైతు దానిని తరలించుకునేదుకు ఆస్కారం ఉంటుంది. ఇలా ఇసుక దిబ్బలపేరుతో దాదాపు 39 నుంచి 45 మందిరైతులు దరఖాస్తు చేసుకోగా.. సదరు అధికారులు అనుమతులు ఇచ్చారు.
ఇసుక దిబ్బల పేరుతో ఇసుక తరలించే అవకాశం గతేడాది డిసెంబర్ 31 నాటికే ముగిసింది. ఆ తర్వాత ఎవరూ పొలాల నుంచి ఇసుకను తరలించడానికి ఆస్కారం లేదని మైనింగ్ అధికారులే చెబుతున్నారు. కానీ, దీని మాటున భారీ అక్రమాలు జరుగుతున్నాయి. నిజానికి డిసెంబర్ నాటికే గడువు ముగిసినా.. నేటికీ పొలాల్లో మేటలు వేసిన ఇసుకను కొందరు కాంట్రాక్టర్లు అక్రమంగా పెద్ద మొత్తంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక మేటల తొలగింపు పేరుతో ఒక్క ఓడేడు గ్రామ పరిధిలోనుంచే రోజుకు సుమారు 20 నుంచి 40 లారీల వరకు అక్రమంగా తరలిస్తున్నారని తెలుస్తోంది. దీనికి కొంత మంది అధికార పార్టీ నాయకుల అండ ఉన్నది. ఇందులో భాగంగానే కొందరు నాయకులు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా ఈ దందాలో భాగస్వాములవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
అంతే కాదు.. ఇందుకోసం మానేరులో కొంత మంది రోడ్డు వేసినట్లు ఆరోపణలున్నాయి. అక్కడితో ఆగకుండా ఇదే రోడ్డుపై కొందరు టోల్టాక్స్ పేరుతో వచ్చిపోయే వాహనాలకు అనధికారికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే, అక్రమ వాహనాలు కాబట్టి.. అడిగినంత టోల్టాక్స్ చెల్లిస్తున్నారు. అలాగే, ఈ రోడ్డు ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిలపల్లి, తదితర గ్రామాలకు చెందిన వందలాది ట్రాక్టర్ల ద్వారా మానేరులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి పూట అక్రమంగా తరలించిన ఇసుకను వేర్వేరు చోట్ల డంప్ చేసి, అక్కడి నుంచి అక్రమార్కులు హైదరాబాద్కు చేరవేస్తున్నారు. ఇదో పెద్ద మాఫియాగా నడస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. అలాగే, నిబంధనల ప్రకారం ఏయే కోణంలో చూసినా.. ప్రస్తుతం పొలాల్లో నుంచి ఇసుకను తరలించడానికి ఆస్కారమే లేదని అధికారులే చెబుతున్నారు. కానీ, ఓడెడ్ నుంచి మంథని మీదుగా ప్రధాన రహదారి వెంట పెద్దమొత్తంలో అక్రమంగా లారీలు వెళ్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ ఇసుక రవాణా గురించి.. ఈ నెల 21న “మానేరు పొడవునా ఇసుక తోడేళ్లు” శీర్షిక పేరిట ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురితం చేసిన విషయం తెలిసిందే.
ఈ కథనం అధికారులతోపాటు అక్రమార్కుల్లోనూ వణుకు పుట్టించింది. జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా గురించి కళ్లకు కట్టినట్లుగా వివరించడంతో అధికారయంత్రాగం అప్రమత్తమైంది. ఆ మేరకు సదరు రవాణాదారులను కొద్ది రోజుల పాటు నిలిపివేయమని మౌఖికంగా సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో సమ్మక్క జాతర రావడంతో గడిచిన మూడు నాలుగు రోజులుగా అక్రమ రవాణా నిలిపేశారని తెలుస్తోంది. మళ్లీ విషయం సద్దు మణగడంతో తిరిగి ఒకటి రెండురోజుల్లో మళ్లీ పాత పద్ధతిలోనే ఇసుక అక్రమ రవాణాకు సదరు అక్రమార్కులు పూనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారయంత్రాగం పటిష్టంగా పనిచేస్తే తప్ప.. అడ్డుకట్ట పడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాగే కొనసాగిస్తే.. రేపు ప్రభుత్వం కొత్తపాలసీ తీసుకొచ్చినా ప్రయోజనం ఉండకపోగా.. అక్రమ వ్యాపారానికి అడ్డూ అదుపూ లేకుండా పోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.