కరీంనగర్ రూరల్, మార్చి 13: ఒత్తిడితో కూడిన జీవన విధానం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఆకస్మిక గుండెపోట్లు పెరిగాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్ కలిగిన యువత ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ సీపీఆర్ (కార్డియాక్ పల్మనరీ రిససిటేషన్), లైఫ్సేవింగ్ టెక్నిక్స్పై అవగాహన కలిగి ఉండడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. సోమవారం కరీంనగర్ జిల్లా నగునూర్ ప్రతిమ వైద్య కళాశాలలో ఐసీడీఎస్, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి లైఫ్ సేవింగ్ టెక్నిక్ (సీపీఆర్ ఆండ్ ఏఈడీ)పై శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి గంగుల జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి లైఫ్ సేవింగ్ టెక్నిక్స్పై శిక్షణ ఇవ్వాలని వైద్యశాఖ అధికారులను కోరారు. మనిషి జన్మ విలువైనదని, అంతే విలువగా సమాజంలో ఉన్నతంగా బతకాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యమని చెప్పారు.
ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని పేర్కొన్నారు. కరోనా కాలంలో చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలు, మెరుగైన వైద్యమందించడంతో అనేకమంది ప్రాణాలను కాపాడగలిగామన్నారు. ప్రజల ప్రాణాలను రక్షించే లక్ష్యంతో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన ప్రతిమ వైద్యకళాశాల నిర్వాహకులను అభినందించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. కార్డియాక్ అరెస్ట్పై ప్రప్రథమంగా స్క్రీనింగ్ కార్యక్రమాన్ని కరీంనగర్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు సహకారంతో చేపట్టామని తెలిపారు. ఇందులో ఈసీజీ, టూడీఎకో లాంటి పరీక్షలు ఉచితంగా చేస్తున్నారని, అవసరమైన వారికి మందులు ఇస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ, ఆరోగ్యరంగంలో కరీంనగర్ జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా కార్డియాక్ అరెస్ట్ నివారణపై దృష్టిపెడతామని పేర్కొన్నారు. కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, సీపీఆర్పై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మండలి విప్ కౌశిక్రెడ్డి, మేయర్ యాదగిరి సునీల్రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీటీసీ సభ్యులు, రాజేశ్వర్రావు, డీఎంహెచ్వో జువేరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డీపీవో వీర బుచ్చయ్య, ప్రతిమ డీన్ వివేకానంద పాల్గొన్నారు.