గోదావరిఖని, నవంబర్ 30: సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 9,10,11 తేదీల్లో తలపెట్టిన 72 గంటల సమ్మెను కార్మికులు సక్సెస్ చేయాలని టీబీజీకేఎస్, 5 జాతీయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బీ జనక్ప్రసాద్, సీఐటీయూ అధ్యక్షుడు టీ రాజిరెడ్డి, హెచ్ఎంఎస్ నాయకుడు జే నారాయణ, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని 88 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి నిర్ణయించి అందులో సింగరేణికి చెందిన కల్యాణిఖని బ్లాక్-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాక్-3, శ్రావణ్పల్లి బ్లాకులను చేర్చిందని చెప్పారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను ఇప్పటికే సంస్థ అభివృద్ధి చేసి రూ.వందలాది కోట్లు ఖర్చు చేసిన తర్వాత వాటిని వేలం వేయడాన్నితీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.
కార్మికులందరూ పాల్గొనాలి..
బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకునే దాకా కార్మికులు పోరాటం చేయాలి. కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాజకీయాలకతీతంగా సింగరేణిలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించాం. బొగ్గు బ్లాకుల వేలం జరుగకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింగరేణి బ్లాకుల విషయంలో కేంద్రం స్పష్టమైన విధానం ప్రకటించే దాకా పోరాటం ఆగదు. బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవాలి. ఒకవేళ ఎవరైనా బొగ్గు బ్లాకులు దక్కించుకున్న వాటిని ఓపెన్ చేయకుండా అడ్డుకునే విధంగా కార్యాచరణతో ముందుకు సాగుతాం. 72గంటల సమ్మెను కార్మికులు గ్రాండ్ సక్సెస్ చేసి కేంద్రానికి హెచ్చరిక పంపాలి.
ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర..
కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల బొగ్గు పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోవడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలి. 72గంటల సమ్మెను సక్సెస్ చేయండి. ఇప్పటికే సింగరేణి ఓపెన్కాస్టు గనుల్లో బొగ్గుపై కప్పబడి ఉండే ఓబీ తొలగింపు పనులతో పాటు బొగ్గును తీసే పనులను ప్రైవేట్కు అప్పగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని అండర్గ్రౌండ్ గనుల్లో ప్రైవేట్ వ్యక్తులతో బొగ్గును తీసేందుకు ప్రణాళికలు వేస్తున్నరు. వీటన్నింటినీ అడ్డుకోవడానికి సమ్మెలో సంపూర్ణంగా పాల్గొనాలి.
దిగివచ్చే దాకా పోరాటం ఆగదు..
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 13వ తేదీన దేశంలోని 88 బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు నిర్ణయించింది. అందులో సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది. దీనిని అడ్డుకోవడానికి కేంద్రంలోని మోడీ సర్కార్కు బుద్ధ్ది చెప్పేలా కార్మికలోకం 72 గంటల సమ్మెలో పాల్గొనాలి. సింగరేణిలో పోరాటాల ద్వారానే అనేక హక్కులు సాధించిన ఘనత ఉంది, అదే విధంగా ముందుకు సాగాలి. కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించే అవకాశముంది.
సమ్మెకు సిద్ధం..
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని సింగరేణి బీఎంఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కార్మికులు సమ్మె పోరాటాల ద్వారానే హక్కులు సాధించుకునే అవకాశముంది. మేమూ సమ్మెలో పాల్గొంటాం. కార్మికులు మద్దతు తెలుపాల్సి ఉంది. సమ్మె విజయవంతం కోసం కృషి చేస్తాం.
సంపూర్ణంగా మద్దతిస్తాం..
72 గంటల సమ్మెకు హెచ్ఎంఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. కార్మికుల హక్కుల పరిరక్షణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మేము ముందుంటాం. బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ త్వరలోనే జరిగే సమ్మెలో కార్మికులు సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాలి. బీజేపీ సర్కారు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి.