రాజన్న సిరిసిల్ల, జనవరి 6 (నమస్తే తెలంగాణ): గత నెల 28నుంచి ఈ నెల 6 వరకు జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాల్టీల్లోని 67వార్డుల్లో చేపట్టిన ప్రజాపాలన సదస్సులు శనివారంతో ముగిశాయి. మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహలక్ష్మీ, చేయూత పథకాల కోసం ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులకు ఉచితంగానే అప్లికేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ప్రజాపాలన నోడల్ అధికారి శ్రీదేవసేన జిల్లాలో పర్యటించి, సదస్సుల నిర్వహణ తీరును పరిశీలించారు. క
లెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, గౌతమి పూజారి, ఆర్డీవోలు, డీఆర్డీఏ, అధికారులతోపాటు జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలందరూ సదస్సులను సందర్శించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లాలోని 13మండలాల్లో నిర్వహించిన సదస్సులకు హాజరయ్యారు.
చివరి రోజు శనివారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు, తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమాల్లో ఆది శ్రీనివాస్, ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సదస్సులను అదనపు కలెక్టర్ గౌతమి పూజారి సందర్శించి, డేటా ఎంట్రీని పరిశీలించారు. డాటా ఎంట్రీలో పొరపాట్లు జరుగకుండా చూడాలని ఆపరేటర్లు, అధికారులకు సూచించారు. కాగా, చివరి రోజు 40,157 దరఖాస్తులు రాగా, మొత్తం 1,90,965 వచ్చినట్లు అధికారులు తెలిపారు. వచ్చిన అప్లికేషన్లను ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు వారు చెప్పారు.