సద్దులకు వేళయింది.. నేటి పెద్ద బతుకమ్మ సంబురాలకు ఊరూవాడా ముస్తాబైంది.. ఎనిమిది రోజులపాటు ఆటపాటలతో హోరెత్తిన వేడుక, ఆదివారం అంబరాన్నంటనున్నది.. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆడిపాడేందుకు మహిళలు సిద్ధం కాగా, అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయాచోట్ల వేదికలను సిద్ధం చేయడంతోపాటు చెరువులు, కుంటల వద్ద బారికేడ్లు, లైటింగ్ సౌకర్యం కల్పిస్తున్నది. కాగా, రెండు రోజుల నుంచే పూల విక్రయాలతో మార్కెట్లు సందడిగా మారాయి.
– కమాన్చౌరస్తా, అక్టోబర్ 21
కమాన్చౌరస్తా, అక్టోబర్ 21: బతుకమ్మ సంబురం ఈనెల 14న మొదలైంది. అప్పటి నుంచి ప్రతి రోజూ ఆడబిడ్డల ఆటపాటలతో వీధివీధీ హోరెత్తుత్తున్నది. ఆదివారం జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకోనున్నారు. ఇప్పటికే చాలాచోట్ల పూలను తెచ్చి ఇళ్లలో భద్రపరిచారు. ఉదయం నుంచే బతుకమ్మలను పేర్చి, సాయం త్రం కూడళ్ల వద్ద ఆడిపాడి, జలవనరుల్లో నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వాయినాలు ఇచ్చిపుచ్చుకొని సత్తుపిండి పంచుకుంటూ బతుకమ్మ పా టలు నెమరేసుకుంటూ ఇళ్లకు చేరుకుంటారు.
సద్ద్దుల సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మార్కెట్లన్నీ రద్దీగా మారాయి. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాకేంద్రాలతోపాటు గోదావరిఖని, మెట్పల్లి, హుజూరాబాద్, జమ్మికుంటలో కిటకిటలాడాయి. ఉదయం నుంచే అటు అమ్మకందారులు, ఇటు కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. కరీంనగర్లోని మార్కెట్ రోడ్డు, టవర్ సర్కిల్, తెలంగాణ చౌరస్తా రోడ్లన్నీ కిటకిటలాడాయి. గోదావరిఖనిలో ప్రధాన చౌరస్తా ప్రాంతం పూల జాతరను తలపించింది. చుట్టు పక్కల గ్రామాల నుంచి పూలను తీసుకువచ్చి విక్రయించగా, కొనుగోలు చేసేందుకు వచ్చిన నగరవాసులతో కళకళలాడింది.
సద్దుల పండుగ కోసం అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా చోట్ల పిచ్చిమొక్కలను తొలగించి, బతుకమ్మ ఆడుకునేందుకు వీలుగా స్థలాలను చదును చేశారు. చెరువులు, కుంటల వద్ద లైటింగ్తోపాటు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జన కేంద్రాలకు వెళ్లే వీధుల వెంట కూడా లైటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అన్ని విధాలా సేవలందించేందుకు వీలుగా బల్దియాల సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా ఈ సారి చెరువులు, కుంటల వద్ద నీరు సమృద్ధిగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గజఈతగాళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. మరోవైపు అన్ని ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికులతో జోరుగా పనులు కొనసాగిస్తున్నారు