ముకరంపుర, ఫిబ్రవరి 2: కరోనాతో అస్తవ్యస్తంగా మారిన గ్రానైట్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ రూపంలో చేయూతనందించడం సంతోషదాయకమని జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఇబ్బందుల్లో ఉన్న ఇండస్ట్రీని ఆదుకోవడానికి 40 శాతం రాయితీని వర్తింపజేస్తూ జీవో జారీ చేయడంపై అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కొత్తపల్లి మండలం బావుపేట గ్రామంలో బావుపేట-ఎలగందుల ఎక్స్ రోడ్డు వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జిల్లా గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గ్రానైట్ పరిశ్రమల యజమానులు, లీజుదారులు, టేకేదార్లు, లారీ అసోసియేషన్ సభ్యులు, అనుబంధ పరిశ్రమల యజమానులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాయితీని ఇప్పించేందుకు కృషి చేసిన మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, హరీశ్రావు, అజయ్కుమార్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎంపీ నామానాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, గ్రానైట్ ఇండస్ట్రీస్ రాష్ట్ర అసోసియేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పీ శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో ఐదేళ్ల క్రితం కేవలం 40 నుంచి 50 వరకు ఉన్న గ్రానైట్ పరిశ్రమల సంఖ్య ప్రస్తుతం 300కు చేరిందన్నారు.
50వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. కరోనాతో రెండేళ్లుగా పరిశ్రమలు దెబ్బతిన్నాయని, నిర్వహణ ఇబ్బందులతో ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొందన్నారు. వేలాది మందికి ఉపాధినిస్తున్న పరిశ్రమలకు రాయితీ ఇచ్చి ఆదుకోవాలని మంత్రులు, రాష్ట్ర అసోసియేషన్తో కలిసి సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ మేరకు గ్రానైట్ పరిశ్రమలకు స్లాబ్ సిస్టంలో 40శాతం రాయితీ ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసి ఇండస్ట్రీని కాపాడే చర్యలు చేపట్టిందన్నారు. రెండేళ్లుగా గ్రానైట్ క్వారీలు ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. 80శాతం చైనాకు ఎగుమతి అవుతుండగా, అవి నిలిచిపోయినట్లు చెప్పారు. షిప్ రవాణా చార్జీలు భారీగా పెరిగాయన్నారు. 20శాతమే స్థానిక పరిశ్రమల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు. క్వారీలకు క్యూబిక్ మీటర్ విధానంలో రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లుగా రావాల్సిన రాయితీలను 50శాతం చొప్పున ప్రభుత్వం రెండేళ్లలో ఇప్పించేలా చూడాలని కోరారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గంగుల ప్రదీప్ మాట్లాడుతూ, కరోనాతో గ్రానైట్ అమ్మకాలు లేవన్నారు. రాయితీతో నిర్వహణ భారంగా మారిన పరిశ్రమలు తిరిగి కోలుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కార్మికులు, యువతకు ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రానైట్ పరిశ్రమలను కాపాడాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 40 శాతం రాయితీ ప్రకటించినట్లు పేర్కొన్నారు. రాయితీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి జిల్లా అశోక్కుమార్ మాట్లాడుతూ, 40 శాతం రాయితీతో పరిశ్రమలకు బలాన్ని చేకూర్చినట్లయిందన్నారు. కార్యక్రమంలో గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ కిరణ్కుమార్, పీ జగన్మోహన్రావు, సంయుక్త కార్యదర్శులు కే సతీశ్కుమార్, కే శ్రీనివాస్, సభ్యులు హరికిషన్ముందడా, కుమార్, హరీశ్రాజ్, శ్రీధర్, శ్రీధర్కుమార్, గణేశ్, కిషన్కుమార్, ప్రవీణ్కుమార్, కరుణాకర్, సతీశ్, కుంసింగ్, అనుబంధ పరిశ్రమలు, లారీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.