విద్యానగర్, డిసెంబర్ 13: మెదడులో రక్తస్రావం సంభవించిన ప్రారంభంలో కొన్ని గంటలు చాలా కీలకమైనవని, సమయానికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని యశోద దవాఖాన (న్యూరో ఫిజీషియన్) వైద్యుడు డాక్టర్ మోహన్కృష్ణ పేర్కొన్నారు. నగరంలోని యశోద దవాఖానలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన వసుధ (38) గత జూన్లో తీవ్ర తలనొప్పితో బాధపడుతూ దవాఖానకు వచ్చినట్లు తెలిపారు. పరీక్షలు చేయగా మెదడులోని సీటీఏలో ఎడమ వైపు బేసల్ గ్వాంగ్లియా ఏరియాలో రక్తపు గడ్డ ఉన్నట్లు తేలిందన్నారు. అది మెదడుపై ఒత్తిడి పెంచుతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అదే రోజు రాత్రి ఆమెకు కుడి వైపు పక్షవాతం రావడంతో సోమాజిగూడలోని యశోద దవాఖానకు తీసుకువచ్చినట్లు చెప్పారు.
అక్కడ వసుదను వెంటిలేటర్పై ఉంచి రిపీట్ స్కాన్లో పెద్ద రక్తపు గడ్డ మెదడుపై ఒత్తిడి పెంచడంతో పాటు మెదడు వెంట్రికిల్స్లోకి కూడా సోకినట్లు గుర్తించామన్నారు. డికంప్రేషన్ క్రెనియెక్టమి హెమటోమా ఎవాక్యువేశన్ చేశామన్నారు. ఆగస్టులో బోన్ ప్లాప్ రిప్లేస్మెంట్ చేశామన్నారు. ఇప్పుడు వసుద నడుస్తున్నారని, మాట్లాడుతున్నారని, అర్థం చేసుకోగలుగుతున్నారని చెప్పారు. మెదడులో రక్తస్రావం, రక్తపు గడ్డ పరిమాణంలో పెరుగడం వంటివి, త్వరగా గుర్తించి సమయానికి చికిత్స చేస్తే ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. వసుధ భర్త సురేశ్ మాట్లాడుతూ, యశోద దవాఖాన వైద్యులు తన భార్యకు పునర్జన్మ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వైద్యులు, దవాఖాన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.