జగిత్యాల : చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండలం గంగారాం తండాలో పులి( Tiger ) సంచారంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ( Sunke Ravishankar ) పేర్కొన్నారు. పులిని అటవీశాఖ అధికారులు ( Forest Officials ) వెంటనే బంధించి సురక్షితమైన ప్రాంతానికి తరలించాలని జగిత్యాల జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు బుధవారం జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్కు వినతి పత్రం అందజేశారు.
గత ఏడాది కాలంగా చొప్పదండి నియోజకవర్గం లోని కొడిమ్యాల మండలం, సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరి ప్రాంతాలలో పులి సంచరిస్తూ సుమారు 20 పశువులను చంపి తిన్నదని అన్నారు. గత నాలుగు రోజులుగా కొడిమ్యాల ప్రాంతంలో తిరుగుతున్న పులిని పట్టుకోవడానికి అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
సీసీ కెమెరాల్లో పులి కదలికలు స్పష్టంగా రికార్డు అయినా, పులి సంచారం నిర్ధారణ అయినా కూడా అధికారులు కేవలం నామమాత్రంగా వచ్చి వెళుతున్నారని ఆరోపించారు. భద్రతా చర్యలు చేపట్టడంలేదని విమర్శించారు. పులి భయం కారణంగా రైతులు తమ పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, పంటలకు నీరు పెట్టలేక పంటలు ఎండిపోతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కొడిమ్యాల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, యూత్ అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, నాయకులు కొత్తూరి స్వామి, పవన్,నజీర్, ఆదిమల్లు, అజ్జు పాల్గొన్నారు.