ప్రకృతిని నమ్ముకొని సేద్యం చేసే రైతన్న.. వరి కోతల తర్వాత కొయ్యకాలును తగులబెట్టడం ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నది. నేలకు సారాన్ని చేకూర్చే క్రిమికీటకాలు నశించిపోవడంతోపాటు వాయు కాలుష్యం పెరిగిపోవడమే కాదు భూ సమతుల్యత దెబ్బతింటూ, మరో పంటపై తీవ్ర ప్రభావం పడుతున్నది. దీర్ఘకాలంలో ఇది సమాజానికి, పంటలకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొయ్యకాలును కాల్చకుండా కలియదున్నితే ఎన్నోప్రయోజనాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.
జగిత్యాల, మే 20 (నమస్తే తెలంగాణ) జమ్మికుంట : ఉత్తర, దక్షిణ తెలంగాణలోని రైతులు వానాకాలం, ఎండకాలం వరి కోతలు పూర్తయిన వెంటనే తమ పొలంలోని వ్యర్థాలను (కొయ్యకాలును) కొన్నేండ్లుగా తగులబెడుతూ వస్తున్నారు. వాస్తవానికి గతంలో వరిపొలం కోతల తదుపరి గడ్డిని పాడికి, ఆహారంగా వేసే ప్రక్రియ కొనసాగేది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం వరకు ఇదే పరిస్థితి ఉండేది. రైతులందరూ ఓ వైపు వ్యవసాయం చేస్తూనే, మరోవైపు పశువులను పోషించడంతో ఇది ఆహారంగా ఉపయోగపడింది. అయితే మూడు దశాబ్దాల నుంచి వ్యవసాయ రంగంలో సాంకేతిక నైపుణ్యం పెరిగిపోయి, యాంత్రీకరణ ఆరంభమైంది. రైతుల వద్ద పశు సంపద క్రమంగా తగ్గిపోయింది. వరికోతలు సైతం గతంలో మనుషులను వినియోగించి చేయించగా, నేడు హార్వెస్టర్తో చేయిస్తున్నారు. దీని వల్ల భూమికి చాలా ఎత్తున వరి చేనును కోయాల్సి వస్తుంది. అలాగే యంత్రాల కింద కొయ్యకాలు నలిగిపోయి, గడ్డి పశుగ్రాసంగా ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రైతు తన పొలంలో మరో పంటను సాగు చేసే క్రమంలో కొయ్యకాలు ఒక సమస్యగా మారిపోతూ వచ్చింది. అలాగే విపరీతమైన ఎరువులను వాడుతుండడంతో పంటకు పలు రకాల తెగులు వస్తున్నాయి. తర్వాతి పంటలోనూ ఈ గడ్డి అవశేషాలు ఉంటే మళ్లీ తెగులు వస్తుందన్న అభిప్రాయం రైతుల్లో నాటుకుపోయింది. పొలంలో మిగిలిన కొయ్యకాలును భూమిలోనే కలియ దున్నకుండా కాల్చివేసి సాగుకు భూమిని సిద్ధం చేస్తూ వస్తున్నారు.
ఉత్తర భారతంలో నిషేధం.. కాల్చితే కేసులే ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో కొయ్యకాలు కాల్చివేతపై పూర్తి నిషేదం విధించారు. కొయ్యకాలును కాల్చడం వల్ల భారీగా వాతావరణ కాలుష్యం జరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వాలు దీనిపై పూర్తి నిషేధం విధించాయి. ఒక వేళ రైతులు నిషేదాజ్ఞలు అతిక్రమించి కొయ్యకాలును కాల్చితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జైలుకు కూడా పంపుతున్నాయి. అలాగే కొయ్యకాలును కాల్చిన రైతు పొలంలో పండిన పంటను కొనుగోలు చేయడంపై సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకునే విషయంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు కొయ్యకాలును నిషేధించాలని సుప్రీంకోర్టు సైతం సూచనలు చేయడం గమనార్హం.
ఒక టన్ను వరి గడ్డి పెరుగుదలకు 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతో పాటూ కొత మోతాదులో సూక్ష్మపోషకాలు అవసరమవుతాయి. ఈ కొయ్యకాళ్లను భూమిలో కలియ దున్నితే గడ్డి ద్వారా పోషకాలన్నీ తిరిగి నేలకు చేరుతాయి. అంతేకాకుండా పంట అవశేషాల వ్యర్థాలను కంపోస్టు చేయడం ద్వారా సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఫలితంగా భూసారం పెరుగుతుంది. తక్కువ పెట్టుబడులతో సాగు చేసే వీలుంది.
పొలంలో కొయ్యకాలును కాల్చివేయడం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని శాస్త్రవేత్తలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అజ్ఞానంతో ఎంతో మేలు చేసే కొయ్యకాలును భూమిలో కలియ దున్నకుండా, కాల్చివేసి, భవిష్యత్తు పంటను నాశనం చేస్తున్నాడని, అలా తన అవగాహన లేమితో వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాడని అంటున్నారు. కొయ్యకాలును కాల్చివేసే క్రమంలో కొయ్యకాలుతో పాటు, భూమి గట్టిపడిపోతుందని, దీంతో గట్టిపడిన భూమి, దున్నే సమయంలో సరిగా ఉండదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీంతో పొలాన్ని కలియదున్నడం వీలుకాదంటున్నారు. కాల్చివేయడం వల్ల భూమిలో సూక్ష్మజీవులు చనిపోతాయని, అలాగే వానపాములు నాశనం అవుతాయి. భూమి గుల్లగా మారదు. దీంతో నాటు వేసిన తర్వాత వేర్లకు సరిగా పోషకాలు అందవు. ఫలితంగా పైరు సరిగా పెరుగకపోవడంతో రైతులు యూరియాను ఎక్కువగా వినియోగించాల్సి వస్తున్నది. అయితే యూరియాను ఎక్కువగా వేసినప్పటికీ దాన్ని స్వీకరించి వేర్లకు అందించే సూక్ష్మజీవులు అప్పటికే మృతి చెందడంతో యూరియా వృథాగా మారిపోతుందని చెబుతున్నారు. ఇక విచ్చలవిడిగా యూరియా వాడడంతో భూగర్భంలోకి యూరియా చేరి భవిష్యత్లో భూగర్భజలం అంతా విషతుల్యం అయ్యే ప్రమాదం ఉంది. ఇదంతా నేరుగా వరిపొలంపై ప్రతిఫలిస్తుందని చెబుతున్నారు. ఇక వాతావరణంలో అనేక మార్పులు కలుగుతాయి. కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పాలిసైర్లిక్, హైడ్రోకార్బన్ గాల్లో కలిసిపోయి జీవకోటిపై తీవ్ర ప్రభావం పడుతుంది. వీటి మూలంగా జీవ, మానవ శరీరంలోకి కొవ్వు పదార్థాలు చేరి, అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. పురుషుల్లోని శుక్రకణాలు దెబ్బతినడం, గర్భస్థ శిశువుల ఎదుగుదల తగ్గిపోవడం, మహిళల్లో హార్మోన్లలో అసమానతలు, క్యాన్సర్, అస్తమా, వంటి ప్రమాదకరమైన రోగాలు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వానకాలంలో దుక్కిని దుమ్ము చేసే సమయంలో ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్పేట్ను పొలంలో వేయాలి. ఇలా వేయడం వల్ల నేలలో మిగిలి పోయిన వరి కొయ్యలు తొందరగా కుళ్లిపోతాయి. తర్వాత వరి పంట నాటే సమయానికి నేల ద్వారా పోషకాలు అందుబాటులోకి వస్తాయి. వరి కొయ్యలను నేలలోనే కలియదున్నడం వల్ల సేంద్రియ కర్బన శాతం పెరగుతుంది. పంట దిగుబడులు 5-10శాతం పెరిగినట్లు పరిశోధనల ద్వారా వెల్లడైందని కేవీకే శాస్త్రవేత్త విజయ్ వివరించారు.
కోతల తర్వాత పొలంలోని కొయ్యకాలును రైతులు కాల్చివేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిని సారించాలి. పంట కోసిన తర్వాత రైతులు కొయ్యకాలును కాల్చివేయవద్దని ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరమున్నది. పంటకు మెడవిరుపు, అగ్గితెగులు, పంటలో తాలు, తప్ప రావడానికి ఈ కాల్చివేతే ప్రధాన కారణం. కొయ్యకాలును కాల్చివేస్తే భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి. పంట వేసిన తర్వాత యూరియా వేసినా ప్రయోజనం ఉండదు. సూక్ష్మజీవులు అప్పటికే చనిపోయి ఉండడంతో యూరియాను గ్రహించవు. దీంతో యూరియా, భూమిలోకి ఇంకిపోయి, భూమిని విషతుల్యంగా మార్చివేస్తుంది. రైతులు ఇప్పటికైనా కొయ్యకాలును కాల్చివేయకుండా, వాటిని భూమిలోనే కలియదున్ని సేద్యం చేసుకోవాలి.
– సురేశ్, జిల్లా వ్యవసాయాధికారి (జగిత్యాల)
వరికొయ్యలను కాల్చడం వల్ల రైతులు అనర్థాలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలా చేయడంతో భూమికి ఉపయోగపడే సూక్ష్మజీవులు, ఇతర జీవాలు చనిపోతాయి. వరికోత యంత్రాలతో 30 సెం.మీ ఎత్తులో కోయడం వల్ల 50 శాతం గడ్డి కొయ్య రూపంలో మిగిలిపోతుంది. ప్రతి టన్నుకు వరిగడ్డిలో పెరుగుదలకు ఉపయోగపడే 18.9 కిలోల పొటాషియం, 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరంతో పాటు కొంత మేర మేలుచేసే సూక్ష్మపోషకాలు ఉంటాయి. వీటిని భూమిలోనే కలియ దున్నడం వల్ల ఇవన్నీ మళ్లీ తర్వాత పంటకు ఉపయోగపడుతాయి.
– కే విజయ్, కృషి విజ్ఞాన కేంద్రం సేద్యవిభాగం శాస్త్రవేత్త (జమ్మికుంట)