Amber Kishore Jha | ఫర్టిలైజర్ సిటీ, మే 29 : శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు. నెలవారి సమీక్షలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్ అధికారులతో ఆయన గురువారం కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
పోలీస్ స్టేషన్, డివిజన్, జోన్ల వారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్షీట్కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్ కమిషనర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్ స్టేషన్ వారిగా సమీక్షా జరిపారు.
నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై చర్చించారు. అనంతరం సిపి మాట్లాడుతూ సూదీర్ఘకాలంగా పెండింగ్ లో వున్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రధానంగా మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయడంతో పాటు, నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా తగు సాక్ష్యాధారాలను కోర్టుకు అందజేయాలని,అలాగే మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల్లో అధికారులు వేగంగా స్పందించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహిరంచాలని, దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, విజబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, ప్రధానంగా చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవడంలో అధికారులు సమయస్పూర్తిగా వ్యవహరిస్తూ దర్యాప్తు కోనసాగించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ గురించి సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులతో కలసి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లలో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. బక్రీద్ పండుగ సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. తరుచుగా నేరాలకు పాల్పడే నేరస్థులపై సస్పెక్ట్, రౌడీ షీట్ల తెరవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని సేకరించాల్సి వుంటుందని, పోలీస్ అధికారులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారితో స్నేహపూర్వకంగా వుండాలని, భాధ్యయుతంగా విధులు నిర్వహిస్తూ బాధితులకు న్యాయం చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఏం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాస్, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.