కోర్టుచౌరస్తా, జనవరి 21: కేసుల విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ బాధ్యతతో ఆయా కేసులపై పూర్తి అవగాహనతో ఉండాలని, అప్పుడే సరైన తీర్పులు వస్తాయని ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్(పబ్లిక్ ప్రాసిక్యూటర్) వీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అసిస్టెంట్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఆయన శనివారం కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రతి నెలా మొదటి శనివారం ప్రాసిక్యూటర్లు వారి పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించాలని, పోలీస్ అధికారుల హాజరు, హాజరుకాని వారిపై నివేదిక పంపించాలని తెలిపారు.
మూడో శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాసిక్యూటర్లతో రివ్యూ సమావేశం ఉంటుందని, నాలుగో వారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే వర్చువల్ జూమ్ మీటింగ్లో పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అన్ని కోర్టుల పరిధి ప్రాసిక్యూటర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను తొలగించుకునేందుకు పలు సూచనలు చేశారు. ఇక్కడ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీవీ రాజ్కుమార్, కనుకుల సంజీవరెడ్డి, గౌరు రాజిరెడ్డి, గడ్డం లక్ష్మణ్, శరత్, లక్ష్మీప్రసాద్, మురళి, ఆకుల రాములు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు.