కరీంనగర్ రాంనగర్, డిసెంబర్ 25: కరీంనగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోరీ కలకలం రేపుతున్నది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్టు తెలుస్తున్నది. సెలవు దినం కావడంతో ఉదయం వాచ్మెన్ అటుగా వెళ్లి చూసే సరికి గొల్లెం విరిగి, తాళం కింద పడి ఉన్నది. అనుమానం వచ్చి అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి కార్యాలయ సిబ్బంది చేరుకున్నారు. ఆ వెంటే వన్టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. సాధారణ చోరీ వలే గొల్లెం విరగ్గొట్టి ఉండడంతో దొంగల ముఠా పనే అయి ఉంటుందని భావించి క్లూస్టీం నిపుణులను పిలిపించారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్ టీం నిపుణులు కార్యాలయం అంతా క్షుణ్ణంగా పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.
కార్యాలయ సిబ్బందితో మాట్లాడి అధికారులను పిలిపించి లోపల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలించారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించినట్లు రికార్డు కావడంతో దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మరికొన్ని సీసీ కెమెరాల ఫుటేజీ కూడా పరిశీలిస్తే నిందితుడి ఆనవాళ్లు లభ్యమయ్యే అవకాశమున్నది. ఇదిలా ఉంటే మొత్తం రిజిస్ట్రేషన్ రికార్డులన్నీ డిజిటలైజ్ చేశామని, మ్యాన్వల్ రికార్డు పోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదని చెబుతున్నారు. ప్రాథమిక పరిశీలనలో నిందితుడు కేవలం ఒక రికార్డును మాత్రమే తీసుకెళ్లినట్లు తేలడంతో కావాలనే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.