రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. రాయికల్ మండలంలోని మారుమూల గ్రామమైన కట్కాపూర్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. తొమ్మిదేళ్ల కాలంలో రూ.12 కోట్ల నిధులతో అనేక పనులు జరిగాయి. వాడవాడలా సీసీ రోడ్లు, డ్రైనేజీల, వైకుంఠధామం, కల్యాణ మండపం, 100 శాతం ఇంకుడు గుంతలు, పల్లె దవాఖాన, పంచాయతీకి నూతన భవనం, కంపోస్ట్ షెడ్, తారు రోడ్డు నిర్మించడంతో పాటు నిత్యం చెత్తసేకరణ, విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బుల ఏర్పాటు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనాలు, వీధులకు ఇరువైపులా నాటిన మొక్కలతో గ్రామం అభివృద్ధికి కేరాఫ్గా నిలుస్తున్నది.
– రాయికల్, మార్చి 9
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సహకారంతోనే గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రభుత్వం ప్రతి నెలా పల్లెప్రగతి నిధులు మంజూరు చేస్తుండటంతో గ్రామంలో కావాల్సిన అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి వాడలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాం. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతను తవ్వించాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నాం. గ్రామంలో మెయిన్ రోడ్డుకు ఆనుకొని డ్రైనేజీ నిర్మాణం విషయమై ఎమ్మెల్యేకు విన్నవించగా, వెంటనే స్పందించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
– ముద్దసాని రాజమౌళి, సర్పంచ్, కట్కాపూర్